Congress: ఎమ్మెల్యే టికెట్ కావాలంటే దరఖాస్తు చేసుకోవాల్సిందే: రేపట్నుంచే స్వీకరణ
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నవేళ కాంగ్రెస్ పార్టీ సరికొత్త ప్రణాళికలకు శ్రీకారం చుడుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ఆశావాహుల నుంచి తెలంగాణ కాంగ్రెస్ దరఖాస్తులు ఆహ్వానించింది. ఈ ప్రక్రియలో శుక్రవారం నుంచి అంటే ఆగస్టు 18 నుంచి ఆగస్టు 25వ తేదీ వరకు అర్జీలు తీసుకుంటారు. ఇప్పటికే ధరఖాస్తు విధివిధానాలను సబ్ కమిటీ ఖరారు చేసింది.
దరఖాస్తుల స్వీకరణకు రుసుము కూడా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు ధరఖాస్తు చేసుకోవడానికి రూ.25 వేలు, ఓసీలకు రూ.50 వేలు చొప్పున ధరఖాస్తు రుసుము ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఆశావహుల కోసం నాలుగు పేజీల ధరఖాస్తును గాంధీభవన్లో అందుబాటులో ఉంచారు.

దరఖాస్తు చేసుకునేవారు వ్యక్తిగత వివరాలతో పాటు, ప్రస్తుత పార్టీలో హోదా, గతంలో పార్టీకి చేసిన సేవ, ఇప్పటి వరకు పొందిన పదవులు, గతంలో ఎన్నికల్లో పోటీ చేసిన అనుభవం, ఎన్నికల్లో గెలుపు ఓటములు, గతంలో ఇతర పార్టీలలో పనిచేసిన అనుభవం, సామజిక మీడియా యాక్టీవిటి, క్రిమినల్ కేసులు, కోర్ట్ శిక్షలతో పాటు పోటీ చేయదలచిన సెగ్మెంట్ తదితర అంశాలను ధరఖాస్తులో పొందుపరచాల్సి ఉంటుంది.
అంతేగాక, గెలిచినా.. ఓడినా పార్టీలోనే ఉంటానంటూ అభ్యర్థుల నుంచి ప్రమాణ పత్రం కూడా తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కాగా, అర్జీలను తీసుకోడానికి గాంధీభవన్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తారు. ధరఖాస్తులు స్వీకరణ ముగిసిన తర్వాత కాంగ్రెస్ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నేతృత్వంలో పార్టీ రాష్ట్ర ఎన్నికల కమిటీ స్క్రూటీని చేస్తుంది. దరఖాస్తుల పరిశీలన తర్వాత అర్హులైన అభ్యర్థుల జాబితాను రూపొందించి స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ కమిటీకి నివేదిస్తారు.

ఈ జాబితాను స్క్రీనింగ్ కమిటీ క్షుణ్ణంగా పరిశీలించి అవసరమైతే అభ్యర్థులతో నేరుగా మాట్లాడతారు. సామాజిక సమీకరణాలు, గెలుపు అవకాశాలు, అభ్యర్థి పోటీ చేయదలిచిన సెగ్మెంట్లోని ప్రత్యర్థుల బలాలు, బలహీనతలు బేరీజు వేసుకుని పార్టీ అధికంగా ఉన్న నియోజకవర్గాల నుంచి మూడేసి పేర్లు సెంట్రల్ ఎన్నికల కమిటీ సిఫారసు చేస్తారు. సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ముందుకు వచ్చిన స్క్రీనింగ్ కమిటీ నివేదికను మరోసారి పరిశీలించి చివరకు సీడబ్ల్యూసీ ఆమోదంతో అభ్యర్థుల జాబితాను ప్రకటించడం జరుగుతుంది.
పోటీ చేసే అభ్యర్థి ఎంపిక విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోతేనే ఈ నాలుగంచెల విధానాన్ని అనుసరిస్తారు. అలాంటి నియోజకవర్గ అభ్యర్థుల ప్రకటన చివరి జాబితాలో ఉంటుందని అంచనా వేస్తున్నారు. నేరుగా ప్రియాంకగాంధీ, రాహుల్గాంధీలు తెలంగాణ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ, ప్రచారాన్ని పర్యవేక్షిస్తున్నందున టికెట్ల పంపిణీలో గ్రూపులు నడిపేవారి మాటలు చెల్లకపోవచ్చని నేతలు అంచనా వేస్తున్నారు. అయితే, అశావాహులు ఎక్కువగా ఉండటం, ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలతో చివరిదశలో కొంత గందరగోళం ఏర్పడే అవకాశాలు కూడా లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.












Click it and Unblock the Notifications