ఫిబ్రవరి 26 నుండి తెలంగాణలో కాంగ్రెస్ బస్సు యాత్ర: వైఎస్ సెంటిమెంట్, కలిసొచ్చేనా?
హైదరాబాద్: తెలంగాణలో బస్సు యాత్ర చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకొంది. శనివారం నాడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల సమావేశంలో ఈ మేరకు ఈ నిర్ణయం తీసుకొన్నారు. 2004లో కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే సమయంలో పాదయాత్ర తర్వాత బస్సు యాత్రను నిర్వహించింది. చేవేళ్ళ నుండి బస్సు యాత్రను ప్రారంభించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకొంది. వైఎస్రాజశేఖర్ రెడ్డి సెంటిమెంట్నే కాంగ్రెస్ నేతలు పాటించాలని నిర్ణయం తీసుకొన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి26వ తేది నుండి బస్సు యాత్రను ప్రారంభించనున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ ఇప్పటినుండే ప్లాన్ చేస్తోంది. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ నేతలు అనుసరించిన విధనాలను ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు అమలు చేయాలని భావిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో అధికారాన్ని చేపట్టాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు కొందరు పాదయాత్ర చేయాలని భావించారు. అయితే బస్సు యాత్రకే కాంగ్రెస్ పార్టీ నేతలు మొగ్గు చూపారు.
ఫిబ్రవరి 26నుండి కాంగ్రెస్ బస్సు యాత్ర
ఈ ఏడాది ఫిబ్రవి 26 నుండి ప్రారంభం కానున్న బస్సు యాత్ర మార్చి11 వరకు తొలివిడత జరగనుంది. ఏప్రిల్ 1 నుండి మే 15వ, తేది వరకు మలివిడత బస్సు యాత్రను నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నేతలు నిర్ణయం తీసుకొన్నారు. శనివారం గాంధీ భవన్లో ముఖ్యనాయకుల సమమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవరి 26వ,తేదిన రంగారెడ్డి జిల్లా చేవెళ్ళలో బస్సుయాత్ర ప్రారంభం కానుంది.తొలివిడతలో మార్చి 11వ, తేదివరకు యాత్ర సాగుతోంది.
చేవేళ్ళ సెంటిమెంట్
2004 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆనాటి సిఎల్పీ నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేవేళ్ళ నుండి పాదయాత్రను ప్రారంభించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించిన తర్వాత కూడ ఏదైనా కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించాలంటే కూడ చేవేళ్ళ నుండి రాజశేఖర్రెడ్డి ప్రారంభించేవాడు. చేవేళ్ళ సెంటిమెంట్ ఆనాడు వైఎస్కు, కాంగ్రెస్ పార్టీకి కలిసివచ్చింది. ఇప్పుడు అదే సెంటిమెంట్ను తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు నమ్ముకొంటున్నారు చేవెళ్ళ నుండే ఫిబ్రవరి 26వ, తేది నుండి బస్సు యాత్రను ప్రారంభిస్తున్నారు.
కాంగ్రెస్ నేతల పాదయాత్రలు
కాంగ్రెస్ పార్టీ నేతల పాదయాత్రలు కూడ నిర్వహించాలని నిర్ణయం తీసుకొన్నారు.మే 15 నుంచి కాంగ్రెస్ సీనియర్ నాయకులు మల్లు భట్టి విక్రమార్క, రేవంత్రెడ్డి, పొన్నం ప్రభాకర్ పాదయాత్రలు నిర్వహించనున్నట్టు పీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్ రెడ్డి ప్రకటించారు.అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వి. హనుమంతరావు రథయాత్రను కూడ చేపట్టనున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.
జూన్ 2న, బారీ బహిరంగ సభ
బస్సు యాత్ర, పాదయాత్రలు, రథయాత్రలను జూన్ 1వ, తేదికి పూర్తి చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జూన్ 2వ, తేదిన హైద్రాబాద్, లేదా వరంగల్ ప్రాంతాల్లో సభలను నిర్వహించనున్నట్టు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.