తెలంగాణ కాంగ్రెస్ కొత్త బాస్ రాక ఖరారు..!!
తెలంగాణలో మరి కొద్ది నెలల్లోనే ఎన్నికలు జరగనున్నాయి. టీపీసీసీలో నెలకొన్న పరిస్థితులు హైకమాండ్ కు అంతు చిక్కటం లేదు. తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త ఇంఛార్జ్ ను నియమించింది. ఈ నెల 11న తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ హైదరాబాద్ రానున్నారు. రెండు రోజుల పాటు పార్టీ సమావేశాలు ఏర్పాటు చేసారు. రేవంత్ వర్సస్ సీనియర్లుగా మారిన తెలంగాణ కాంగ్రెస్ లో చక్కదిద్దే ప్రయత్నాలు ప్రారంభించనున్నారు. పార్టీ కొత్త ఇంఛార్జ్ రాకతో పరిస్థితులు మారుతాయా..కొత్త చీఫ్ మాట వింటారా అనేది ఇప్పుడు చర్చకు కారణమవుతోంది.
తెలంగాణ రాష్ట వ్యవహారాల నూతన ఇంఛార్జ్ మానిక్ రావ్ థాక్రే రాష్ట్రానికి వస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ లో పరిస్థితులు చక్కదిద్దే బాధ్యత హైకమాండ్ ఆయనకు అప్పగించింది. రేవంత్ కు మద్దతుగా నిలుస్తున్నారని..పార్టీ గురించి ఆలోచించం లేదంటూ మాజీ ఇంఛార్జ్ ఠాక్కూర్ పైన ఫిర్యాదుతో హైకమాండ్ ఆయన్ను తప్పించింది. కొత్తగా నియమితులైన థాక్రే కాంగ్రెస్ రాజకీయాల్లో తల పండిన నేత. అయితే, తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాలను సరిచేసే సమర్ధత ఆయనకు ఉందా లేదా అనేది స్పష్టత రావాల్సి ఉంది. రెండు రోజుల పాటు థాక్రే పార్టీ వ్యవహారాలను పర్యవేక్షించనున్నారు. 11వ తేదీ ఉదయం 11 గంటలకు ఏఐసీసీ కార్యదర్శులతో సమావేశం కానున్నారు. ఆ తరువాత పీసీసీ అధ్యక్షుడుతో థాక్రే ప్రత్యేకంగా సమావేశం అవ్వాలని నిర్ణయించారు.
టీపీసీసీ చీఫ్ రేవంత్ తో సమావేశం తరువాత సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో సమావేశానికి నిర్ణయించారు. ఇద్దరి నాయకత్వం రాష్ట్ర పార్టీకి కీలకం కావటంతో..ఆ ఇద్దరితో సమావేశం తరువాత మిగిలిన నేతలతో భేటీ కానున్నారు. ఆ వెంటనే సీనియర్ నేతలు ,వర్కింగ్ ప్రెసిడెంట్ లతో సమావేశానికి నిర్ణయించారు. మధ్యాహ్నం 3 గంటలకు పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం జరగనుంది. ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు.. పిసీసీ అధికార ప్రతినిధులతోనూ సమావేశానికి నిర్ణయించారు. రెండో రోజు పర్యటనలో డీసీసీ అధ్యక్షులో రాష్ట్ర ఇంఛార్జ్ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. అనుబంధ సంఘాల నేతలను ఆహ్వానించారు. ఆ తరువాత పార్టీ నేతలతో ముఖాముఖి సమావేశాలకు నిర్ణయించారు. పూర్తిగా రాష్ట్రంలో పరిస్థితులను ఆరా తీయటం..అధ్యయనం చేయటం పైనే తొలి విడత పర్యటన ఉంటుందని చెబుతున్నారు.