కాంగ్రెస్లో ప్రశాంత్ కిశోర్ చేరికపై భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు: బీజేపీ హస్తం ఉందట
హైదరాబాద్: ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్.. కాంగ్రెస్లో చేరబోతున్నారంటూ వస్తోన్న వార్తలు తెలంగాణలో రాజకీయాల్లో కలకలం రేపుతోంది. అధికార తెలంగాణ రాష్ట్ర సమితితో కాంగ్రెస్ రాజకీయంగా ఓ యుద్ధమే చేస్తోంది. వచ్చే సంవత్సరం జరిగే అసెంబ్లీ ఎన్నికల కోసం సమాయాత్తమౌతోంది. అధికారంలోకి రావడానికి పావులు కదుపుతోంది. అదే సమయంలో- టీఆర్ఎస్ విజయం కోసం ప్రశాంత్ కిశోర్ పని చేయబోతోండటం ఆ పార్టీ నాయకులకు మింగుడు పడట్లేదు.
దీనిపై తాజాగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రశాంత్ కిశోర్-టీఆర్ఎస్ విషయాన్ని అధ్యయనం చేయడానికి పార్టీ అధిష్ఠానం ఓ కమిటీని వేసిందని చెప్పారు. ఈ కమిటీ ఇచ్చే నివేదిక చూసిన తరువాత సోనియా గాంధీ నిర్ణయం తీసుకుంటారని వ్యాఖ్యానించారు. అప్పటి వరకు దీని గురించి మాట్లాడటం సరికాదని పేర్కొన్నారు. ప్రశాంత్ కిశోర్.. కాంగ్రెస్ పార్టీలో చేరబోతోన్నారనే విషయం పత్రికల్లో వచ్చిందే తప్ప అధిష్ఠానం గానీ, జాతీయ స్థాయి నాయకులు గానీ దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదని గుర్తు చేశారు.
ప్రశాంత్ కిశోర్ వ్యవహారంపై మీడియా సంస్థలు.. తమ అవసరాలకు అనుగుణంగా మలచుకుని వార్తలను ప్రసారం చేస్తోన్నాయని భట్టి విక్రమార్క చెప్పారు. అవన్నీ ఊహాగానాలేనని ఆయన తోసిపుచ్చారు. కాంగ్రెస్-టీఆర్ఎస్ పొత్తు ఉంటుందనే వార్తలను కూడా ఆయన కొట్టి పారేశారు. కాంగ్రెస్ గానీ, టీఆర్ఎస్ గానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదని చెప్పారు. ఈ పొత్తు విషయంలో భారతీయ జనతా పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోందని విమర్శించారు.
ఏదో ఒకరకంగా బురదచల్లే ప్రయత్నాన్ని బీజేపీ నాయకులు ఎప్పుడూ చేస్తూనే ఉంటారని, అవతలి పార్టీలను బలహీనపర్చే కుట్ర పన్నుతుంటారని ఆరోపించారు. బీజేపీ చేస్తోన్న విమర్శలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. మాణిక్కం ఠాగూర్ చేసిన ట్వీట్ను ఆయన సమర్థించుకున్నారు. శతృవుతో కలిసే మిత్రుడిని ఎప్పుడూ నమ్మకూడదనే విషయం వాస్తవమేనని, దాన్ని తాను కూడా సమర్థిస్తానని అన్నారు. ఈ ట్వీట్- ప్రశాంత్ కిశోర్ను ఉద్దేశించి చేసిందని తాను అనుకోవట్లేదని చెప్పారు.
తెలంగాణను ఇచ్చిన పార్టీగా తమను ప్రజలు ఆదరిస్తున్నారని, క్షేత్రస్థాయిలో ప్రజల్లో ఆదరణ పెరుగుతోందని మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఎనిమిది సంవత్సరాలుగా తాము అధికార టీఆర్ఎస్తో పోరాటం సాగిస్తున్నామని గుర్తు చేశారు. వచ్చే సంవత్సరం జరిగే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అధికారంలోకి రాబోతున్నామనే ధీమాను భట్టి విక్రమార్క వ్యక్తం చేశారు. ఆ ఉద్దేశంతోనే బీజేపీ గందరగోళం సృష్టి స్తోందని ఆరోపించారు.