రూటు మార్చిన రేవంత్ రెడ్డి..!!
హైదరాబాద్: ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోన్న నేపథ్యంలో- తెలంగాణలో రాజకీయ వాతావరణం క్రమంగా వేడెక్కుతోంది. అధికార భారత్ రాష్ట్ర సమితి ఇప్పటికే ఖమ్మంలో నిర్వహించిన భారీ బహిరంగ సభతో ఎన్నికల ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టయింది. భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ నాయకులు జిల్లాలవారీగా పాదయాత్రలకు దిగుతున్నారు. పదాధికారులు, బూత్ స్థాయి నాయకులతో భేటీ అవుతున్నారు.
కీలక ఉత్తర్వులు జారీ చేసిన శ్రీలక్ష్మీ- వేల కోట్ల ప్రాజెక్టులు..!!
కాంగ్రెస్ జోరు..
ఇక కాంగ్రెస్ నాయకులు కూడా గేర్ మార్చారు. తమ ఎన్నికల ప్రచార కార్యక్రమాలు, వ్యూహాలకు మరింత పదును పెడుతున్నారు. ప్రస్తుతం హాత్ సే హాత్ జోడో యాత్రను నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్రను చేయనున్నారు. తెలంగాణలో ఈ యాత్ర ఫిబ్రవరి 6వ తేదీన ప్రారంభం కానుంది. 60 రోజులపాటు కొనసాగుతుంది. భద్రాచలం నుంచి ఈ యాత్ర మొదలు కానుంది.
6 నుంచి..
ఫిబ్రవరి 6వ తేదీన హాత్ సే హాత్ జోడో కార్యక్రమానికి సోనియాగాంధీ లేదా ప్రియాంకా గాంధీ వాద్రాను ముఖ్య అతిధిగా ఆహ్వానించాలని తీర్మానించారు కాంగ్రెస్ నాయకులు. ప్రియాంక గాంధీ ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఈ యాత్రను సమన్వయ పర్చడానికి ప్రత్యేకంగా పరిశీలకులను నియమించనున్నారు.
రేవంత్ మీదే..
ఈ పాదయాత్రకు రేవంత్ రెడ్డి సారథ్యాన్ని వహించబోతోన్నారు. దీన్ని విజయవంతం చేయడం ద్వారా గ్రామస్థాయిలో పార్టీ క్యాడర్ లో నూతనోత్తేజాన్ని తీసుకుని రావాలనేదే ఆయన లక్ష్యంగా కనిపిస్తోంది. 2014 తరువాత ఎదుర్కొన్న ప్రతి ఎన్నికలోనూ ఎదురైన చేదు అనుభవాలను తుడిచిపెట్టేలా.. ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి ఘన విజయాన్ని కట్టబెట్టాలని భావిస్తోన్నారు. ఇందులో ఆయన ఎంతవరకు సక్సెస్ అవుతారనేది చర్చనీయాంశమౌతోంది.
భేషజాలను పక్కన పెట్టి..
అందర్నీ కలుపుకొని వెళ్లడంలో రేవంత్ రెడ్డి చొరవ తీసుకుంటోన్నారు. పార్టీలో అసమ్మతి గళం వినిపించకుండా చేస్తోన్నారు. అసమ్మతి నాయకులందరినీ ఏకతాటిపైకి తీసుకుని రావడానికి చర్యలు చేపట్టారు. ఇప్పటికే కోమటిరెడ్డి వెంకటరెడ్డి సుదీర్ఘ విరామం తరువాత గాంధీ భవన్ కు చేరుకోవడం చర్చనీయాంశమైంది. రేవంత్- కోమటిరెడ్డి ఏకాంతంగా చర్చలు జరిపారు. వారి మధ్య సయోధ్య కుదిరినట్టేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
దళిత ఓటుబ్యాంక్ కోసం..
తాజాగా కాంగ్రెస్ నాయకులు దళిత ఓటుబ్యాంక్ పై దృష్టి సారించారు. దళిత, గిరిజన ఆత్మగౌరవ సభను నిర్వహించనున్నారు. ఈ సాయంత్రం నాగర్ కర్నూల్ జిల్లాలోని బిజినేపల్లిలో ఈ సభ ఏర్పాటు కానుంది. పెద్ద ఎత్తున జన సమీకరణ చేస్తోన్నారు కాంగ్రెస్ నాయకులు. తెలంగాణా కాంగ్రెస్ ఇన్ ఛార్జ్ మాణిక్ రావ్ థాకరే సహా పలువురు సీనియర్ నేతలు హాజరు కానున్నారు. దళిత నాయకులపై దాడికి నిరసనగా సభ నిర్వహిస్తున్నారు.