ఆపద్బాంధవుడు: 'ఒక్క నిమిషం' గండం నుంచి విద్యార్థులను గట్టెక్కించిన పోలీస్
Recommended Video
న్యూఢిల్లీ: 'ఒక్క నిమిషం' నిబంధన విద్యార్థులకు పెద్ద సవాల్గా మారింది. పరీక్ష సమయం కంటే ముందుగానే బయలుదేరినా.. మధ్యలో అనుకోని ఆటంకాలు తలెత్తితే వారి పరిస్థితి అగమ్యగోచరమే.
హైదరాబాద్ లోని ఓ స్కూలు విద్యార్థులు కూడా ఇలాంటి ఇబ్బందినే ఎదుర్కొన్నారు. అయితే ఆపద్భాంధవుడిలా ఓ పోలీస్ ఆఫీసర్ వారిని ఆదుకోవడంతో.. సమయానికి పరీక్ష కేంద్రానికి చేరుకున్నారు. దీంతో ఆ అధికారిపై ప్రశంసలు కురుస్తున్నాయి.
అర్థాంతరంగా ఆగిపోయిన బస్సు
బుధవారం ఉదయం మహేంద్ర హిల్స్ ప్రభుత్వ జూనియర్ కాలేజీ నుంచి 40మంది విద్యార్థులతో కూడిన బస్సు బయలుదేరింది. విద్యార్థులను పరీక్ష కేంద్రాలకు తరలించే క్రమంలో.. సికింద్రాబాద్ చెక్ పోస్ట్ వద్ద ఆ బస్సు అర్థాంతరంగా ఆగిపోయింది. టైర్ పంక్చర్ అవడంతో ఇక ముందుకు కదల్లేని పరిస్థితి ఏర్పడింది.
8మంది అక్కడే మిగిలిపోయారు..
బస్సు మధ్యలోనే నిలిచిపోవడంతో విద్యార్థులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. వెంట వచ్చిన వార్డెన్ ఆటోల ద్వారా వారిని పరీక్ష కేంద్రాలకు తరలించారు. అందరిని తరలించగా.. మరో 8మంది విద్యార్థులు మాత్రం అక్కడే మిగిలిపోయారు. మరోవైపు సమయం ముంచుకొస్తుండటంతో వారిలో ఆందోళన పెరిగింది.
ఆ పోలీస్.. ఆపద్బాంధవుడే..
విద్యార్థులు వాహనాల కోసం నిరీక్షిస్తూ రోడ్డుపై వేచియున్న సమయంలో.. అటుగా వచ్చిన మారేడ్ పల్లి ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు వారిని చూసి పోలీస్ వెహికల్ ఆపాడు. ఆ ఎనిమిది మంది విద్యార్థులను తమ వాహనంలో ఎక్కించుకుని పరీక్ష కేంద్రాలకు చేర్చారు.
ఫోటో వైరల్
విద్యార్థులకు పోలీస్ చేసిన ఈ సహాయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ విభాగం ఈ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. 24గంటల్లో 3400మంది నెటిజెన్స్ ఈ ఫోటోపై స్పందించడం విశేషం. సదరు పోలీస్ అధికారిని వారంత ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.