తెలంగాణ గవర్నర్ దృష్టికి అన్ని విషయాలు.. !!
శాసనసభ సమావేశాల నేపథ్యంలో తెలంగాణలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. సభలో అధికార, ప్రతిపక్షాల మధ్య చెలరేగిన వివాదం రోడ్డుకెక్కింది. అసెంబ్లీ ప్రస్తుత సమావేశాల నుంచి తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు వేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలోని పార్టీ ప్రతినిధి బృందం లోక్ భవన్లో గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కలిసింది. ఈ రెండు రోజులుగా చోటుచేసుకుంటూ వస్తోన్న పరిణామాలను ఆయన దృష్టికి తీసుకెళ్లింది.
సస్పెన్షన్కు గురైన ఎమ్మెల్యేలతో కలిసి గవర్నర్ను కలిసిన కేటీఆర్.. సభలో తమకు జరిగిన అన్యాయాన్ని, ప్రజాస్వామ్య విలువల ఉల్లంఘనను వివరించారు. ప్రజలకు సంబంధించిన కీలక సమస్యలు, హామీలపై తాము ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకే ఈ కక్షసాధింపు చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. ప్రజల పక్షాన నిలబడి ప్రశ్నించిన తమ ప్రజాప్రతినిధులపై సస్పెన్షన్ వేటు వేయడం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు అని మండిపడ్డారు.

శాసనసభ, బయట చోటు చేసుకున్న అవాంఛనీయ పరిణామాలపై గవర్నర్కు తాము పూర్తి ఆధారాలతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించినట్లు కేటీఆర్ వెల్లడించారు. మైకులు కట్ చేసి, తమ గొంతు నొక్కే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన గవర్నర్.. వెంటనే డీజీపీతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని పిలిపించి మాట్లాడతానని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. గవర్నర్ హామీతో తమకు తప్పకుండా న్యాయం జరుగుతుందని భావిస్తున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇక్కడ న్యాయం జరక్కపోతే తదుపరి కార్యాచరణకు సిద్ధంగా ఉన్నామని కేటీఆర్ స్పష్టం చేశారు. అవసరమైతే ఢిల్లీ వెళ్లి జాతీయ మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయిస్తామని అన్నారు. ప్రజాస్వామ్య పద్ధతులలో ఎన్నికైన ప్రజాప్రతినిధులపై సస్పెన్షన్ వేటు వేయడం అత్యంత విచారకరమని, దీనిపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. కొన్ని పరిణామాల పట్ల స్వయంగా క్షమాపణలు చెప్పినప్పటికీ, తమ నేతలపై ఏకపక్షంగా సస్పెన్షన్ వేటు వేయడం వెనుక అధికార కాంగ్రెస్ వైఖరి స్పష్టమవుతోందని కేటీఆర్ ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ హిందీలో ఓ వ్యంగ్య విమర్శను గుప్పించారు. కాంగ్రెస్ దేశవ్యాప్తంగా ప్రచారం చేసుకునే సిద్ధాంతాలు, రాష్ట్రంలో క్షేత్రస్థాయి పరిణామాలకు ఏమాత్రం పొంతన ఉండట్లేదని ఎద్దేవా చేశారు. ఇది మొహబ్బత్ కీ దుకాన్ కాదని, పూర్తిగా నఫ్రత్ కీ బజార్ అని వర్ణించారు. తెలంగాణలో ప్రస్తుతం ఎమర్జెన్సీ కాలం నాటి భయానక వాతావరణం తాండవిస్తోందని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications
