10గం. తర్వాత బయటకొస్తే వాహనం జప్తు... గల్లీలు,కాలనీలపై పోలీసుల ఫోకస్... టైమ్ పాస్ బ్యాచ్లకు చుక్కలే...
రాష్ట్రంలో లాక్ డౌన్ కొనసాగుతున్నా కొంతమందికి అదేమీ పట్టట్లేదు. ఉదయం 10 గంటల తర్వాత బయటకు రావొద్దన్న ఆంక్షలను వారు లెక్కచేయట్లేదు. ఏ పనీ లేకపోయినా రోడ్లపై హల్చల్ చేస్తున్నారు. ముఖ్యంగా గల్లీల్లో,కాలనీల్లో యథేచ్చగా తిరుగుతున్నారు. స్నేహితులంతా ఒకచోట గుంపుగా చేరి టైమ్ పాస్ చేస్తున్నారు. ఇలాంటి బ్యాచ్లపై ఫోకస్ చేయాలని తాజాగా డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశాలిచ్చారు. ఆంక్షలను ఉల్లంఘించేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పోలీస్ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా డీజీపీ మహేందర్ రెడ్డి ఈ ఆదేశాలిచ్చారు.

వాహనాలు జప్తు చేయాలని ఆదేశాలు...
లాక్ డౌన్ నేపథ్యంలో ఉదయం 6గంటల నుంచి 10 గంటల వరకు నిత్యావసరాల కొనుగోళ్లకు ప్రభుత్వం అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. 10గం. దాటిన తర్వాత అనవసరంగా బయట తిరిగే వాహనదారులను గుర్తించి... వారి వాహనాలను తాత్కాలికంగా జప్తు చేయాలని డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశాలిచ్చారు. గల్లీలు,కాలనీలు,అంతర్గత రహదారుల్లో పోలీస్ నిఘా పెంచాలన్నారు. గల్లీల్లో అనవసరంగా గుమిగూడి టైమ్ పాస్ చేసే బ్యాచ్లపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. కమిషనర్లు,ఏసీపీలు ఉదయం 9.45గంటలకే క్షేత్రస్థాయిలోకి వెళ్లి లాక్ డౌన్ను పర్యవేక్షించాలన్నారు.

సైరన్ మోగాక బయట తిరగవద్దు...
ఉదయం 10 గంటలకు అన్ని ప్యాట్రోలింగ్ వాహనాలు సైరన్ మోగించాలని... రోడ్లపై జనాన్ని ఖాళీ చేయించాలని డీజీపీ ఆదేశించారు. ప్రజలు ఉదయం 6గంటల నుంచి బయటకు వచ్చి నిత్యావసరాలు కొనుగోలు చేసేలా అవగాహన కల్పించాలన్నారు. రద్దీగా ఎక్కువగా ఉండే కూరగాయలు,చేపల మార్కెట్లలో కరోనా వ్యాప్తికి ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ఆయా శాఖల అధికారులతో సంప్రదించి తగిన చర్యలు చేపట్టాలన్నారు.

గల్లీలు,కాలనీలపై ఫోకస్...
ఉదయం 10 గంటల తర్వాత గల్లీల్లో ఆకతాయి బ్యాచ్లు హల్చల్ చేస్తున్నాయి. అంతా ఒక్కచోట చేరి టైమ్ పాస్ చేస్తున్నారు. గల్లీల్లోకి పోలీసులు రారన్న ధీమాతో యథేచ్చగా తిరుగుతున్నారు. ఓవైపు జనమంతా కరోనా భయంతో ఇళ్లకే పరిమితమైతే... ఇలాంటి ఆకతాయిలు అనవసరంగా బయట తిరుగుతూ వైరస్ వ్యాప్తికి కారణమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఇలాంటి టైమ్ పాస్ బ్యాచ్లను ఉపేక్షించవద్దని... గల్లీల్లోకి వెళ్లి వారిని చెదరగొట్టాలని డీజీపీ ఆదేశించినట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు గురువారం(మే 20) నుంచి గల్లీలు,కాలనీలపై కూడా ఫోకస్ చేయనున్నారు.

కరోనా పాజిటివ్ రిపోర్ట్ లేకపోయినా...
తెలంగాణలో లాక్డౌన్ను ఈ నెల 30 వరకు పొడగించిన సంగతి తెలిసిందే. అప్పటివరకూ ఆంక్షలు కొనసాగనున్నాయి. రాష్ట్రంలో క్రమంగా కేసులు తగ్గుముఖం పడుతుండటంతో లాక్ డౌన్ను పకడ్బందీగా అమలుచేసి వీలైనంత త్వరగా ఈ పరిస్థితి నుంచి బయటపడాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇక కరోనా రోగులకు సంబంధించి లక్షణాలు లేకపోయినా ఆస్పత్రిలో చేర్చుకోవాలని తాజాగా ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు ఆదేశాలిచ్చారు.కరోనా లక్షణాలు ఉన్నవారిని ఆసుపత్రుల్లో చేర్చుకోవడంపై కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను అందరూ పాటించాలని ఆయన సూచించారు. ఈ మేరకు శ్రీనివాసరావు అన్ని జిల్లాల డీఎంహెచ్వోలకు ఆదేశాలు జారీచేశారు. లక్షణాలతో వచ్చే రోగులకు కరోనా పాజిటివ్ రిపోర్ట్ లేదన్న కారణంతో వైద్యానికి నిరాకరించకూడదని చెప్పారు.












Click it and Unblock the Notifications