3 నెలలు జాగ్రత్తగా ఉండాల్సిందే: 25 లక్షల మంది సెకండ్ డోస్ తీసుకోకుండా తిరుగుతున్నారన్న డీహెచ్
హైదరాబాద్: పండగల సీజన్లో సరైన జాగ్రత్తలు తీసుకోకుంటే మళ్లీ కరోనావైరస్ విజృంభించే అవకాశం లేకపోలేదని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు న్నారు. తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు గత మూడు నెలల నుండి తగ్గుముఖం పట్టాయని తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల కరోనా తీవ్రత, థర్డ్ వేవ్ను అడ్డుకున్నామన్నారు.
తెలంగాణలో కరోనా కేసులు తగ్గుతున్నాయి కానీ..
అన్ని జిల్లా ఆసుపత్రిలో పిడియట్రిక్స్ బెడ్స్ ఏర్పాటు చేసుకున్నామని డీహెచ్ శ్రీనివాసరావు తెలిపారు. దాదాపు అన్ని ఆస్పత్రుల పరిధిలో ఆక్సిజన్ బెడ్స్ ఏర్పాటు చేశామన్నారు. కరోనా రికవరీ రేటు కూడా చాలా పెరిగిందన్నారు. కరోనా ముందు ఉన్న పరిస్థితులు ఇప్పుడు దాదాపుగా కనిపిస్తున్నాయని శ్రీనివాసరావు అభిప్రాయపడ్డారు. . నార్మల్ లైఫ్లోకి వస్తున్నామని తెలిపారు. అయితే, ప్రస్తుతం పండుగ సీజన్ మొదలైందని, రానున్న మూడు నెలలు పండుగలు ఉన్నాయన్నారు. ఇప్పటికీ 200 నుంచి 250 వరకు కేసులు నమోదు అవుతున్నాయన్నారు. ఇప్పటి వరకు కరోనా బారినపడని వారు, ఇప్పుడు జాగ్రతలు పాటించకపోతే కరోనాకు వచ్చే అవకాశం ఉందన్నారు. రీసెంట్గా 17 ఏళ్ల అమ్మాయి కోవిడ్ బారిన పడి చనిపోయిందని తెలిపారు. ఇంకా కరోనా మొత్తం పోలేదని..జాగ్రత్తలు తప్పనిసరి తీసుకోవాలని డీహెచ్ హెచ్చరించారు.
ఓ కరోనా.. మరోవైపు సీజనల్ వ్యాధులంటూ హెచ్చరిక
పండగలు,విందులు, షాపింగ్ చేసేటప్పుడు జాగ్రతలు తప్పనిసరిగా తీసుకోవాలని డీహెచ్ శ్రీనివాసరావు సూచించారు. కుటుంబంలో ఒక్కరు కరోనా బారిన పడితే మిగతా అందరూ కరోనా బారిన పడుతున్నారని వివరించారు శ్రీనివాసరావు. ప్రస్తుతం సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయని.. లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. లేదంటే ప్రాణాపాయం తప్పదని హెచ్చరించారు. పండుగ సీజన్ కాబట్టి.. ప్రయాణాలు మొదలు అయ్యాయి.. పక్క రాష్ట్రాల్లో ఇంకా కరోనా ప్రభావం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలన్నారు. అవసరమైతేనే ప్రయాణాలు చేయాలని సూచించారు.
కరోనా నిబంధనలు గాలి.. వ్యాక్సిన్ కూడా వేసుకోవడం లేదూ..
డిసెంబర్ వరకు మరింత జాగ్రత్త తప్పనిసరని డీహెచ్ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. మాస్క్ పెట్టుకునే వారి సంఖ్య చాలా తగ్గిపోయిందని.. భౌతిక దూరం ఎక్కడ కనిపించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో రెండు కోట్ల లక్ష మందికి ఇప్పటి వరకు కనీసం ఒక డోసు ఇచ్చామని శ్రీనివాస్ రావు వెల్లడించారు. 72 శాతం మందికి మొదటి డోస్ పూర్తైయిందని, 38 శాతం మందికి సెకండ్ డోస్ ఇచ్చామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా రోజుకి దాదాపు 3 లక్షల వరకు వాక్సిన్ ఇస్తున్నామని చెప్పారు. 25 లక్షల మంది సెంకడ్ డోస్ డేట్ దాటిన వాక్సిన్ తీసుకోకుండా తిరుగుతున్నారని తెలిపారు. రెండు డోస్లు తీసుకుంటేనే సురక్షితమని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు స్పష్టం చేశారు. కరోనా వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం లాంటి జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
Recommended Video
తెలంగాణలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి
మరోవైపు, తెలంగాణ రాష్ట్రంలో కరోనావైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గత 24 గంటల వ్యవధిలో 40,354 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 183 మందికి కరోనా సోకినట్లు తేలింది. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 6,68,070కి చేరింది. కరోనా బారినపడి ఇద్దరు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు కరోనాతో మరణించినవారి సంఖ్య 3932కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారి నుంచి 220 మంది కోలుకున్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 4196 యాక్టివ్ కేసులున్నాయి.