ఏపీతోపాటు ఇతర రాష్ట్రాల అంబులెన్సులను ఆపడం లేదు కానీ..: డీహెచ్ శ్రీనివాసరావు ఏమన్నారంటే..?
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సరిహద్దులో అంబులెన్స్ ఆపడంపై వస్తున్న విమర్శల నేపథ్యంలో రాష్ట్ర వైద్యారోగ్యశాఖ సంచలకులు శ్రీనివాసరావు స్పందించారు. వేల మంది ఇతర రాష్ట్రాల రోగులకు వైద్యం అందించామని, ఏ రాష్ట్ర ప్రజలను ఇబ్బంది పెట్టాలని తాము అనుకోవట్లేదని స్పష్టం చేశారు.

ఏపీతోపాటు ఇతర రాష్ట్రాల అంబులెన్సులను ఆపడం లేదు కానీ..
ఆంధ్రప్రదేశ్ సహా ఇతర రాష్ట్రాల నుంచి చికిత్స కోసం హైదరాబాద్ వచ్చే రోగులను సరిహద్దులోనే అన్ని వాహనాలను ఆపడం లేదని చెప్పారు. అనుమతి ఉన్న అంబులెన్స్లను, వాహనాలను అనుమతిస్తున్నామని స్పష్టం చేశారు. పొరుగు రాష్ట్రం నుంచి బయలుదేరడానికి ముందే ఇక్కడి ఆస్పత్రిని సంప్రదించాలన్నారు. దాదాపు 45 శాతం పడకలు ఇతర రాష్ట్రాల రోగులతోనే ఉన్నాయన్న శ్రీనివాసరావు పడకలు లేకుండా వచ్చి ఆస్పతరుల చుట్టూ తిరుగుతున్నారని చెప్పారు. ఈ విషయమై ఏపీ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రల ప్రభుత్వాలకు లేఖలు రాశారని శ్రీనివాసరావు తెలిపారు. ఆస్పత్రివారే రాష్ట్ర ప్రభుత్వానికి వివరాలు పంపుతారన్నారు. ఆ వివరాలను పరిశీలించి అనుమతిస్తామని స్పష్టం చేశారు.

ఇతర రాష్ట్రాల ప్రజలను ఇబ్బంది పెట్టాలనే ఆలోచనలేదు
ఇతర రాష్ట్రాల ప్రజలకు వైద్యం చేయబోమని తాము ఎప్పుడూ చెప్పలేదన్నారు శ్రీనివాసరావు. ఏ రాష్ట్రాల ప్రజలను ఇబ్బంది పెట్టాలని తాము అనుకోవట్లేదని చెప్పారు. శుక్రవారం ఉదయం నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ఐదుగురు రోగులను రాష్ట్రంలోకి అనుమతిచ్చామని తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే పేషెంట్స్ కోసం స్టేట్ కంట్రోల్ రూం కూడా ఏర్పాటు చేశామన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారు ఇబ్బంది పడకుండా ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు.

ఏ రాష్ట్రం నుంచైనా తెలంగాణకు రావొచ్చు..
తమ దగ్గర మెడిసిన్, బెడ్స్ని ఇతర రాష్ట్రాల వారితో పంచుకుంటున్నట్లు శ్రీనివాసరావు తెలిపారు. బీహార్, ఢిల్లీ నుంచి కూడా రోగులు తెలంగాణకు వస్తున్నారని చెప్పారు. ఏ రాష్ట్రం నుంచైనా తెలంగాణకు రావచ్చని ఆయన తెలిపారు. కేంద్రం నుంచి వస్తున్న ఆక్సిజన్ ప్రస్తుతం అవసరాలకు సరిపోతుందన్నారు. అందుకోసమే ఆక్సిజన్ ఆడిట్ విధానం అమలు చేస్తున్నట్లు తెలిపారు. కాగా, శుక్రవారం కూడా తెలంగాణ రాష్ట్రంలోకి వచ్చేందుకు కరోనా రోగులతో భారీ సంఖ్యలో అంబులెన్స్లు సరిహద్దుల్లోకి వచ్చాయి. అయితే, అనుమతి ఉన్న కొన్ని వాహనాలను మాత్రమే పంపించారు. దీంతో కరోనా రోగులతో వచ్చిన ఇతర అంబులెన్స్ లను పోలీసులు అడ్డుకుంటున్నారు. పరిస్థితి విషమించడంతో సరిహద్దుల్లో నిల్చిన అంబులెన్స్ల్లో ఏపీకి చెందిన ఇద్దరు కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు.












Click it and Unblock the Notifications