కడపకు భట్టి విక్రమార్క: ఆ కుటుంబానికి ఎప్పటికీ విధేయుడే
Bhatti Vikramarka: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ముమ్మరంగా కొనసాగుతోంది. సరిగ్గా ఈ ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్లతో కౌంటింగ్ మొదలైంది. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో కాంగ్రెస్ పార్టీ భారీ ఆధిక్యాన్ని ప్రదర్శించింది. అదే దూకుడును ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల కొనసాగించింది హస్తం పార్టీ. తొలి గంటలోనే పూర్తిస్థాయి మెజారిటీని సాధించింది.
తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మేజిక్ ఫిగర్.. 60. ఈ మార్క్ను అలవోకగా అందుకుంది కాంగ్రెస్. తొలి రౌండ్ నుంచే ఆధిక్యతను ప్రదర్శిస్తూ వచ్చింది. ఎక్కడే గానీ వెనుకంజ వేసినట్లు కనిపించలేదు. పోస్టల్ బ్యాలెట్లలో సాధించిన పైచేయిని ఈవీఎం లెక్కింపుల్లోనూ కంటిన్యూ చేసింది.

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధినేత రేవంత్ రెడ్డి సహా పలువురు అభ్యర్థులు విజయం సాధించారు. కొడంగల్లో రేవంత్ గెలిచారు. తన సమీప ప్రత్యర్థి, భారత్ రాష్ట్ర సమితికి చెందిన పట్నం నరేందర్ రెడ్డిని మట్టికరిపించారు. అశ్వారావుపేట, రామగుండంలల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఆదినారాయణ, రాజ్ ఠాకూర్ గెలుపొందారు. పలు నియోజకవర్గాల్లో ఆధిక్యతలో ఉన్నారు కాంగ్రెస్ నాయకులు.
ఖమ్మం జిల్లాలోని మధిర నియోజకవర్గంలో కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క భారీ ఆధిక్యతలో కొనసాగుతున్నారు. తన సమీప ప్రత్యర్థి, బీఆర్ఎస్ అభ్యర్థిపై తొలి రౌండ్ నుంచీ పైచేయి సాధిస్తూ వస్తోన్నారు. ఇక్కడ ఆయన గెలుపు దాదాపుగా ఖాయమైంది. 2009, 2014, 2018 ఎన్నికల్లో ఆయన ఇక్కడి నుంచి హ్యాట్రిక్ సాధించారు.
తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా భట్టి విక్రమార్క ప్రకటిస్తారనే ప్రచారం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో జోరుగా సాగుతోంది. దళిత ముఖ్యమంత్రి అనే కాన్సెప్ట్ను కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ఇక్కడ అమలు చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. రేవంత్ రెడ్డిని ఉప ముఖ్యమంత్రిగా నియమిస్తారని సమాచారం.
కాగా- భట్టి విక్రమార్క.. ఒకట్రెండు రోజుల్లో కడప జిల్లాలో పర్యటిస్తారని తెలుస్తోంది. ఇడుపులపాయలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధిని సందర్శించి, నివాళి అర్పిస్తారని చెబుతున్నారు. తన అనుచరులు, వైఎస్సార్ అభిమానులతో కలిసి ఇడుపులపాయకు వస్తారని అంటున్నారు.
ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ పార్టీని డాక్టర్ వైఎస్సార్ వరుసగా రెండుసార్లు అధికారంలోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. వైఎస్సార్కు ప్రధాన అనుచరుడిగా, అత్యంత విశ్వాసపాత్రుడిగా భట్టికి గుర్తింపు ఉంది. ఆయన ఇంట్లోనూ వైఎస్సార్ నిలువెత్తు చిత్రపటం ఇప్పటికీ ఉంది. తాను వైఎస్సార్ అభిమానినంటూ చాలా సందర్భాల్లోనూ చెప్పుకొన్నారు.












Click it and Unblock the Notifications