ఏపీ-తెలంగాణ గొడవ: ఏం చేయలేం, అక్కడే.. చేతులెత్తేసిన కేంద్రం!
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ స్థానికత కలిగిన విద్యుత్ ఉద్యోగుల విషయమై కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసినట్లుగా తెలుస్తోంది. ఏపీ స్థానికత కలిగిన 1200 మందికి పైగా ఉద్యోగులను తెలంగాణ ప్రభుత్వం కొద్ది నెలల క్రితం రిలీవ్ చేసింది.
ఈ విషయమై కేంద్ర హోంశాఖ కార్యదర్శితో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సీఎస్ల సమావేశమయ్యారు. ఇద్దరు సీఎస్లు హోంశాఖ కార్యదర్శికి సమస్యలు విన్నవించారు. హైకోర్టులో కేసు విచారణ ఉన్నందున వేచి చూద్దామని హోంశాఖ కార్యదర్శి పేర్కొన్నట్లుగా తెలుస్తోంది.
దీని పైన కేంద్రం చేతులెత్తేసినట్లుగా కూడా తెలుస్తోంది. ఈ అంశం కోర్టు పరిధిలోనే ఉన్నందున, అక్కడే తేల్చుకోవాలని ఇరువురు సీఎస్లకు సూచించింది. తద్వారా ఎలాంటి పరిష్కారం లేకుండానే ఈ వ్యవహారం ముగిసింది. ఇందులో తాము జోక్యం చేసుకోలేమని హోంశాఖ కార్యదర్శి చెప్పనట్లుగా కూడా తెలుస్తోంది.
ఏపీ స్థానికత కలిగిన 1200 మందికి పైగా విద్యుత్ ఉద్యోగులను తెలంగాణ రిలీవ్ చేసింది. దీనిపై వారు కోర్టుకు వెళ్లారు. తెలంగాణ ప్రభుత్వం వారికి వేతనాలు చెల్లించాల్సిందేనని న్యాయస్థానం చెప్పింది. వేతనాలు చెల్లించకపోవడంతో ఇంకా ఈ కేసు కోర్టులో ఉంది. ఆగస్టు 5న విచారణ ఉంది.
తెలంగాణ ఉద్యోగుల హెచ్చరిక
తెలంగాణ జెన్కో నుంచి రిలీవ్ చేసిన ఏపీ ఉద్యోగులను బదలాయించే ప్రయత్నాలను నిరసిస్తూ కెపిటీఎస్ ఎదుట తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. ఏపీ ఉద్యోగులను స్థానికత ఆధారంగా ఏపీలోనే ఉంచాలని డిమాండ్ చేశారు. ఏపీ ఉద్యోగులు తెలంగాణకు వస్తే తీవ్ర పరిణామాలుంటాయని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.