తెలంగాణ ఉద్యోగులకు ఈసారీ పాత వేతనమే
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులలో చాలామందికి మే 1న గతంలో మాదిరిగా పాత వేతనమే అందనుంది. మార్చి నెల బకాయిలకు సంబంధించిన అనుబంధ బిల్లను వీరు అందచేయలేదు. దీంతో పాత జీతానికి పరిమితం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.
తెలంగాణ ఉద్యోగులకు 43 శాతం ఫిట్మెంట్ ఇస్తూ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, గత 9 నెలల బకాయిలను ఏ విధంగా చెల్లించేది త్వరలో చెబుతామని పేర్కొంది. ఏప్రిల్ 1న అందుకొనే మార్చి నెల జీతంలో పెంపుతో సహా కొత్త జీతం ఉద్యోగులకు అందుతుందని ప్రభుత్వం తెలిపింది.
వేత స్థిరీకరణకు అవసరమయ్యే జీవోల జారీలో జాప్యం వల్ల ఏప్రిల్ 1న ఉద్యోగులు పాత జీతాన్ని అందుకున్నారు. మార్చి నెల జీతంలో ఏ మేరకు పెంపు ఉంటుందో ఆ మేరకు అనుబంధ బిల్లులను తయారు చేసి ఏప్రిల్ 25లోగా వాటిని, 30వ తేదీలోగా ఏప్రిల్ నెల కొత్త జీతానికి సంబంధించిన బిల్లులను ఇవ్వాలని ఆర్థిక శాఖ సూచించింది.
కానీ 95 శాతానికి పైగా ఉద్యోగుల అనుబంధ బిల్లులు అందలేదని సమాచారం. దీంతో మే 1వ తేదీన కొత్త జీతం కాకుండా పాత జీతం మాత్రమే ఉద్యోగులకు అందనుంది. ఈ నేపథ్యంలో కొత్త జీతం జూన్ 1వ తేదీన నుండి అందనుంది.