బీజేపీ గూటికి మాజీ మంత్రి కృష్ణ యాదవ్!
హైదరాబాద్: బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి కృష్ణ యాదవ్ భారతీయ జనతా పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఏడేళ్లు పార్టీ కోసం పని చేసినా.. ముఖ్యమంత్రి కేసీఆర్ తనను గుర్తించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం హైదరాబాద్లోని నాంపల్లిలో తన అనుచరులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు కృష్ణయాదవ్.
సీఎం కేసీఆర్.. తాను ఒకే మంత్రివర్గంలో పని చేశామని, తెలంగాణ రాష్ట్రంపై స్పష్టమైన అవగాహన ఉందన్నారు. తెలంగాణలోని అట్టడుగు బలహీన వర్గాలకు సేవ చేయాలనే ఆలోచనతో బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరుతున్నట్లు తెలిపారు. రెండు, మూడు రోజుల్లో బీజేపీలో చేరుతున్నట్లు కృష్ణ యాదవ్ ప్రకటించారు.

బీఆర్ఎస్ తనను గుర్తించలేదని.. అందుకే పార్టీ మారుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. టికెట్ ఇస్తామని.. బీఆర్ఎస్ రెండుసార్లు మోసం చేసిందన్నారు కృష్ణ యాదవ్. తన సేవలను బీఆర్ఎస్ పార్టీ వినియోగించుకోలేదని వెల్లడించారు. గతంలో ప్రజల మధ్య ఉన్నానని.. ఇప్పుడు కూడా ఉంటానని తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం మచ్చ లేకుండా పరిపాలిస్తుందన్నారు. రాబోయే ఎన్నికల్లో అధిష్ఠానం నిర్ణయమే శిరసా వహిస్తానని పేర్కొన్నారు. అయితే ఈరోజు బీజేపీలో చేరేందుకు నాంపల్లి రెడ్ రోజ్ ఫంక్షన్లో కృష్ణా యాదవ్ సన్నాహాలు చేసుకున్నా.. పార్టీకి చెందిన అగ్రనేతలు ఎవరూ అందుబాటులో లేకపోవడంతో చివరి నిమిషంలో చేరిక తాత్కాలికంగా ఆగిపోయింది.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన తర్వాత మళ్లీ తెలంగాణలో బీజేపీ శ్రేణులు వరుస కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళుతున్నాయి. మరోవైపు, చేరికలపైనా దృష్టి సారించింది. అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న క్రమంలో బీజేపీలోకి పెద్ద ఎత్తున చేరికలుంటాయని బీజేపీ నేతలు చెబుతున్నారు. తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని స్పష్టం చేస్తున్నారు. త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటిస్తామని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications