"టాప్"లో ఐదుగురు మనోళ్లే... "జేఈఈ" లో మెరిసిన తెలుగు తేజాలు
హైదరాబాద్ : జేఈఈ మెయిన్-2019 ప్రవేశ పరీక్షల్లో మనోళ్లు సత్తా చాటారు. పాత రికార్డులను పదిలపరుస్తూ ఈసారి కూడా విజయ ఢంకా మోగించారు. దేశమంతటా 15 మంది మాత్రమే వంద పర్సంటైల్ సాధించారు. అందులో ఐదుగురు తెలుగు విద్యార్థులు ఉండటం విశేషం.
తెలంగాణకు 4, ఏపీకి 1
జాతీయ స్థాయిలో అత్యధిక స్కోరు సాధించిన తెలుగు తేజాల్లో నలుగురు తెలంగాణకు చెందినవారు కాగా ఒకరు ఆంధ్రప్రదేశ్ విద్యార్థి. తెలంగాణకు చెందిన అడెల్లి సాయికిరణ్ కు 3వ స్థానం, ఇందుకూరి జయంత్ ఫణిసాయికి 7వ స్థానం, కె. విశ్వనాథ్ కు 8వ స్థానం, బట్టెపాటి కార్తీకేయకు 12వ స్థానం దక్కాయి. ఏపీకి చెందిన బొజ్జా చేతన్ రెడ్డి 4వ స్థానంలో నిలిచారు.
ఆ లెక్కల్లో మనోళ్లే టాప్
కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఆధ్వర్యంలో జేఈఈ మెయిన్ పరీక్ష నిర్వహించడం ఇదే ప్రథమం. ఈనెల 8వ తేదీ నుంచి 12వ తేదీ వరకు మొత్తం ఎనిమిది షిఫ్టులలో దేశవ్యాప్తంగా ఆన్లైన్లో నిర్వహించిన ఈ పరీక్షకు 8,74,469 విద్యార్థులు హాజరయ్యారు. 254 పట్టణాల్లోని 467 పరీక్షా కేంద్రాల్లో జేఈఈ మెయిన్ ఎగ్జామ్ నిర్వహించారు. అయితే షిఫ్టుల పరంగా పరీక్షలకు హాజరైన విద్యార్థుల సంఖ్యతో పాటు వారు సాధించిన మార్కులు అలాగే మొత్తం విద్యార్థుల సంఖ్య.. ఇలా అన్నింటినీ పరిగణనలోకి తీసుకుని పర్సంటైల్ స్కోరు ప్రకటించింది ఎన్టీఏ.
ఈ ర్యాంకా.. ఆ ర్యాంకా.. ఏది ఎక్కువుంటే అదే..!
2019-20 అకాడమిక్ ఇయర్ కోసం ఐఐటీల్లో ప్రవేశాల కోసం జేఈఈ మెయిన్స్ ప్రవేశ పరీక్షను ఏటా రెండుసార్లు నిర్వహించాలని డిసైడయింది కేంద్ర ప్రభుత్వం. ఆ మేరకు తొలిదశ పరీక్షను ఈనెలలో పూర్తిచేసింది ఎన్టీఏ. మలి విడత పరీక్షను ఏప్రిల్ లో నిర్వహించనుంది. అయితే దీని ఫలితాలు విడుదల చేశాక... ర్యాంకుల ప్రకటనలో రెండు పరీక్షల్లో టాప్ స్కోర్ ఏదయితే అది పరిగణనలోకి తీసుకోనున్నారు. అలా జేఈఈ మెయిన్స్ ఫలితాల తర్వాత టాప్ లో నిలిచే రెండున్నర లక్షల మందిని ఐఐటీల్లో ప్రవేశాలకు అవసరమైన జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష రాసేందుకు అర్హులుగా ప్రకటించనున్నారు.