టీచర్ల ఆస్తుల ప్రకటన ఉత్తర్వులపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
హైదరాబాద్: తెలంగాణలో దుమారానికి దారి తీసిన ఉపాధ్యాయుల ఆస్తుల ప్రకటన సర్కులరపై ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఈ జీవో అమలును నిలిపివేసింది. ఈ మేరకు విద్యా మంత్రిత్వ శాఖ రాత్రికి రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై ఉపాధ్యాయ సంఘాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైన నేపథ్యంలో- కేసీఆర్ సర్కార్ దీన్ని ఉపసంహరించుకుంది. ఉపాధ్యాయ సంఘాల నుంచి వచ్చిన డిమాండ్ల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది.
వ్యతిరేకతతో..
రాష్ట్రంలో పని చేసే ప్రభుత్వ ఉపాధ్యాయులందరూ ప్రతి సంవత్సరం తమ ఆస్తుల వివరాలు వెల్లడించాల్సి ఉంటుందంటూ ప్రాథమిక విద్య మంత్రిత్వ శాఖ కొద్దిరోజుల కిందటే ఈ సర్క్యులర్ను జారీ చేసిన విషయం తెలిసిందే. వారు ఎలాంటి స్థిర, చర ఆస్తులను కొనుగోలు చేయాలనుకున్నా..లేదా విక్రయించాలనుకున్నా గానీ ప్రభుత్వ అనుమతిని తప్పనిసరి చేస్తే విడుదల చేసిన సర్కులర్ అది. దీనిపై ఉపాధ్యాయ సంఘాల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత ఎదురైంది.
రాజకీయంగా..
ఈ అంశం అటు రాజకీయ రంగు కూడా పులుముకొంది. ఉపాధ్యాయులపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోందంటూ బీజేపీ నేతలు విమర్శించారు. ముఖ్యమంత్రి, ఆయన కుటుంబ సభ్యులు ఆస్తులను ప్రకటించాలంటూ డిమాండ్ చేశారు. ఒకరిద్దరిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఉపాధ్యాయులందరినీ ఇబ్బంది పెట్టేలా ఉత్తర్వులను జారీ చేయడం సరికాదంటూ కాంగ్రెస్ లోక్సభ సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు.
రియల్ ఎస్టేట్ కార్యకలాపాలపై..
ఈ సర్కులర్ ప్రకారం.. ఉపాధ్యాయులు రియల్ ఎస్టేట్, దానికి సంబంధించిన కార్యకలాపాలను గానీ నిర్వహించాల్సి వస్తే ప్రభుత్వ అనుమతిని తీసుకోవాల్సి ఉంటుంది. స్థిర, చర ఆస్తులు అమ్మాలన్నా, కొనాలన్నా ప్రభుత్వానికి తెలియజేయాలి. తమ ఆస్తులకు సంబంధించిన వివరాలను కూడా విద్యామంత్రిత్వ శాఖకు అందజేయాలి. తమ పేరిట ఎలాంటి స్థిర, చరాస్తులు ఉన్నా అంటే..సొంత ఇల్లు గానీ, ప్లాటు గానీ, ఖాళీ స్థలాలు, వ్యవసాయ భూమి వంటి వివరాలను తెలియజేయాల్సి ఉంటుంది.
ఆస్తుల వివరాలు..
అవన్నీ ఎవరి పేరు మీద ఉన్నాయి?.. ఆ వ్యక్తితో ఉన్న సంబంధం ఏమిటీ?.. వాటి మీద వచ్చే వార్షిక ఆదాయం ఎంత? అనే వివరాలన్నింటినీ ప్రభుత్వానికి అందజేయాల్సి ఉంటుందంటూ ఈ నెల 8వ తేదీన ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఇది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తీవ్ర వివాదాన్ని రేపింది. రాజకీయ దుమారానికి కారణమైంది. ఉపాధ్యాయ సంఘాల నుంచి వచ్చిన డిమాండ్లు, రాజకీయ పార్టీల నుంచి చెలరేగిన విమర్శలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ జీవోను వెనక్కి తీసుకుంది.