కరోనా : నిజాముద్దీన్ మర్కజ్ వెళ్లొచ్చిన తెలంగాణ ఉద్యోగి.. దెబ్బకు సచివాలయం ఖాళీ..
తెలంగాణను నిజాముద్దీన్ మర్కజ్ టెన్షన్ వెంటాడుతోంది. హైదరాబాద్లోని తాత్కాలిక సచివాయలం బీఆర్కే భవన్లో పనిచేస్తున్న ఓ ఏఎస్వో అధికారి కూడా మార్చి 13-15 తేదీల్లో నిజాముద్దీన్ మర్కజ్ వెళ్లి వచ్చినట్టుగా గుర్తించారు. మర్కజ్లో మత ప్రార్థనలకు వెళ్లినవారి వివరాలు ప్రభుత్వానికి అందడంతో ఈ విషయం బయటపడింది. దీంతో ఒక్కసారిగా సచివాలయ ఉద్యోగులు ఆందోళనకు గురయ్యారు. ఒకరికొకరు ఫోన్ కాల్స్ చేసుకుని.. ఏం జరుగుతోందని ఆరా తీశారు. చివరకు మంగళవారం(మార్చి 31) మధ్యాహ్నం సచివాలయంలోని ఉద్యోగులందరినీ ప్రభుత్వం ఖాళీ చేయించింది. అనంతరం సచివాలయం మొత్తాన్ని శానిటైజేషన్ చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.

మర్కజ్ వెళ్లి వచ్చిన ఏఎస్ఓ అధికారి
సదరు అధికారి పశు సంవర్ధక శాఖలో పనిచేస్తున్నట్టు సమాచారం. సోమవారం(మార్చి 29) వరకు అతను విధులకు హాజరైనట్టు తెలుస్తోంది. మర్కజ్ ప్రార్థనలకు వెళ్లి వచ్చినప్పటికీ.. ఆ సమాచారాన్ని అతను గోప్యంగా ఉంచినట్టు చెబుతున్నారు. ఐఏఎస్లతో నిర్వహించిన కీలక సమావేశాల్లోనూ అతను పాల్గొన్నట్టుగా చెబుతున్నారు. దీంతో ఆ అధికారిని క్వారెంటైన్కు తరలించినట్టు సమాచారం. అయితే ఇప్పటికైతే అతనిలో కరోనా లక్షణాలేవి లేనట్టు తెలుస్తోంది. ముందు జాగ్రత్త చర్యల్లో క్వారెంటైన్కు తరలించారు. అయితే మర్కజ్ వెళ్లిన చాలామందిలో పాజిటివ్ లక్షణాలు బయటపడుతుండటం సచివాలయ ఉద్యోగులను ఆందోళనకు గురిచేస్తోంది.

కలెక్టర్ల నేత్రుత్వంలో ప్రత్యేక టీమ్స్
తెలంగాణ నుంచి దాదాపు 1030-2000 పైచిలుకు మంది ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ ప్రార్థనలకు హాజరైనట్టుగా అంచనా వేస్తున్నారు. ఇప్పటికే వీరందరినీ స్వచ్చందంగా రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించారు. దీంతో కొందరు స్వచ్చందంగా ముందుకు రాగా.. ఇంకా చాలామందిని గుర్తించాల్సి ఉంది. అన్ని జిల్లాల్లో కలెక్టర్ల నేత్రుత్వంలో ప్రత్యేక టీమ్స్ ఏర్పాటు చేసి ఇతర శాఖల సమన్వయంతో మర్కజ్ వెళ్లి వచ్చినవారందరినీ గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. వారితో పాటు.. వారు ఎవరెవరిని కలిశారు.. ఎక్కడెక్కడ తిరిగారు.. అన్న వివరాలను కూడా ఆరా తీస్తున్నారు.

క్వారెంటైన్ స్టిక్కరింగ్
మర్కజ్ వెళ్లి వచ్చినవారితో కలిసినవారి వివరాలను సేకరిస్తూ.. వారిని ఇళ్లల్లోనే క్వారెంటైన్ చేస్తున్నారు. ఆ ఇళ్లకు క్వారెంటైన్ స్టిక్కరింగ్ కూడా చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రావద్దని చెబుతున్నారు. ఇప్పటివరకు ఒక్క హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలోనే మర్కజ్ వెళ్లివచ్చినవారు దాదాపు 600 పైచిలుకు మంది ఉంటారని అంచనా వేస్తున్నారు. అలాగే ఇప్పటికే తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో మర్కజ్ నుంచి తిరిగొస్తున్న 32 మందిని అదుపులోకి తీసుకుని జగిత్యాలలోని క్వారెంటైన్కు తరలించారు. ఇప్పటివరకు నిజామాబాద్లో 80, నల్లగొండ 45, వరంగల్ అర్బన్ 38, ఆదిలాబాద్ 30, ఖమ్మం 27, నిర్మల్ 25, సంగారెడ్డిలో 22,మహబూబ్ నగర్ 25,మంచిర్యాల 10,మేడ్చల్ 3,పెద్దపల్లిలో 6 మంది మర్కజ్ వెళ్లి వచ్చినట్టుగా గుర్తించారు. ఇంకా చాలామంది సమాచారం సేకరించాల్సి ఉంది.












Click it and Unblock the Notifications