ప్రభుత్వ ఉద్యోగులపై కాంగ్రెస్ సర్కారు వరాల జల్లు.. అనౌన్స్ మెంట్ ఆరోజే ?
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులపై వరాల జల్లు కురవనుంది. ఈ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. జూన్ 2న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఈ ప్రకటన చేయనున్నట్టు చెబుతున్నారు.
డీఏ విడుదలకు అవకాశం..
ఉద్యోగులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న పెండింగ్ డియర్నెస్ అలౌయెన్స్ (డీఏ) లలో ఒకదాన్ని విడుదల చేసే యోచనపై ప్రభుత్వం చర్చలు జరుపుతున్నట్లు భావిస్తున్నారు. దీనిపై ఇప్పటికే ఆర్థిక శాఖ సమీక్ష జరిపినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

ఇతర బకాయిల చెల్లింపు, ఆరోగ్య పథకం..
అలానే డీఏతో పాటు, ఉద్యోగులకు సంబంధించిన ఇతర బకాయిల చెల్లింపు, పదవీవిరమణ చేసిన ఉద్యోగులకు రిటైర్మెంట్ ప్రయోజనాల విడుదలపై కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అదే విధంగా ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య భద్రత కోసం కొత్త ఆరోగ్య బీమా పథకాన్ని ప్రకటించే అవకాశముందని ప్రచారం జరుగుతోంది.
మరోవైపు ఉద్యోగుల సమస్యలపై పరిష్కారాల కోసం ప్రభుత్వం ఇటీవలే ముగ్గురు ఉన్నతాధికారులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఇప్పటికే పలుమార్లు ఉద్యోగ సంఘాల నాయకులతో సమావేశమై వారి వినతులను స్వీకరించింది. వారి ముఖ్యమైన డిమాండ్లపై సానుకూలంగా స్పందించినట్లు ఉద్యోగ సంఘాల నాయకులు తెలిపారు. ఈ కమిటీ ఒకటి, రెండు రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డికి నివేదిక అందజేసే అవకాశం ఉందని అంటున్నారు.
ఇక నివేదిక ఆమోదం తర్వాత, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అధికారిక ప్రకటన విడుదల చేయనున్నట్లు ఉద్యోగ సంఘాల వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ ప్రకటనలు అన్ని జూన్ 2న ప్రకటించే ఛాన్స్ ఉందంటున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు లబ్ది పొందుతారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications