ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం
సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసు కోసం ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ను నియమించింది. సీనియర్ న్యాయవాది సాంబశివారెడ్డిని ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. జీవో ఆధారంగా ఇందుకు సంబంధించి కోర్టులో పంజాగుట్ట పోలీసులు మెమో దాఖలు చేశారు.
ఈ ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ నియామకంపై నాంపల్లి కోర్టు ఏప్రిల్ 15న నిర్ణయం తీసుకోనుంది. కాగా, ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు పలువురు కీలక అధికారులను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రణీత్ రావు, రాధాకిషన్ రావుల నుంచి కీలక సమాచారం సేకరించారు. పలువురిని జైలుకు తరలించారు. కొందరు అధికారులపై సస్పెన్స్ వేటు వేశారు.

ఫోన్ ట్యాపింగ్ కేసుపై సీపీ ఏమన్నారంటే?
ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసుల దర్యాప్తు పారదర్శకంగా కొనసాగుతోందని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. పాతబస్తీ ఈద్గా వద్ద మీడియాతో ఆయన మాట్లాడారు. తొలిసారి ఈ కేసుపై స్పందించిన ఆయన.. కేసు విచారణ వేగంగా జరుగుతోందన్నారు.
ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు క్రమపద్ధతిలో సాగుతోందని సీపీ శ్రీనివాస్ తెలిపారు. రాజకీయ నేతలకు నోటీసులు ఇవ్వనున్నారా? అని సీపీని అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. సమయం వచ్చినప్పుడు అన్ని వివరాలు వెల్లడిస్తామని ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications