శ్రీరెడ్డి ఇష్యూ ఎఫెక్ట్.. ఇక వివాదం ఆపండి: సినీ పరిశ్రమకు మంత్రి
హైదరాబాద్: సినిమా పరిశ్రమలో కొనసాగుతున్న వివాదానికి ఇంతటితో ముగింపు పలకాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శనివారం 'మా' (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్)కు సూచించారు. టాలీవుడ్కు చెందిన ప్రముఖులు, 'మా' ప్రతినిధులు ఆయనతో భేటీ అయ్యారు.
సినీరంగంలో తలెత్తిన వివాదాలు, లైంగిక వేధింపుల ఆరోపణలు తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. సమావేశం ముగిసిన అనంతరం తలసాని మీడియాతో మాట్లాడారు. ఇటీవల సినీ పరిశ్రమలో జరిగిన పరిణామాలపై చర్చించామని, ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని సినీ పెద్దలు చెప్పారన్నారు.
సినిమా పరిశ్రమ అభివృద్ధి సంస్థ ద్వారా నటులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని నిర్ణయించామని, ఫిర్యాదుల కోసం ఎఫ్డీసీలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తామని, చిత్ర నిర్మాణానికి సంబంధించి మధ్యవర్తులు, సమన్వయకర్తలు లేకుండా చూస్తామని చెప్పారు. ఆర్టిస్టులకు ఇచ్చే రెమ్యునరేషన్ ప్రొడక్షన్ డిపార్టుమెంట్ ద్వారా నేరుగా వారికే ఇవ్వాలని సూచించినట్లు చెప్పారు.
మహిళలు, నటులు ఏమైనా సమస్యలు ఉంటే పోలీసుల దృష్టికి తీసుకురావాలని, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, షీ టీమ్స్కు ఫిర్యాదు చేయవచ్చునని తెలిపారు. షూటింగ్ ప్రదేశాల్లో మహిళలకు సరైన సౌకర్యాలు కల్పించాలని సూచనలు చేశామన్నారు.
నటన శిక్షణా కేంద్రాలను ప్రక్షాళన చేస్తామని, మహిళలకు రక్షణ, వారికి జరిగే మోసాలపై ప్రభుత్వం కఠినంగా ఉంటుందని, ఇక ఈ వివాదాన్ని ఇంతటితో ఆపాలని పరిశ్రమను, మీడియాను కోరుతున్నానని తలసాని తెలిపారు. కాగా, ఇటీవల శ్రీరెడ్డి ఇష్యూ నేపథ్యంలో వివాదం కొనసాగిన విషయం తెలిసిందే.