ఆ రైతుల ఖాతాల్లో వెంటనే ఎకరాకు రూ 10 వేలు - ప్రభుత్వం ప్రకటన..!!
మొంథా తుఫాను రైతులకు తీరని వేదన మిగుల్చింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ పంట నష్టం జరిగింది. ఏపీలో ప్రాధమికంగా తుఫాను కారణంగా రూ 5,265 కోట్ల మేర నష్టం జరిగినట్లు అధికారులు తేల్చారు. తెలంగాణలో తుఫాను.. వరదల కారణంగా నష్టపోయిన రైతులకు అండగా నిలుస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో..పంట నష్టం జరిగిన రైతులకు నష్ట పరిహారం పైన ప్రకటన చేసింది. ప్రకటించిన పరిహారం రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయనుంది.
మొంథా తుఫాను కారణంగా రైతులు భారీగా నష్టపోయారు. తెలంగాణలో ప్రాథమిక అంచనా ప్రకారం.. రాష్ట్రంలో సుమారు 4.5 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు అధికారులు తేల్చారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేల చొప్పున అందిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. అలాగే 80 లక్షల ధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తుమ్మల చెప్పారు. మార్కెట్లో తడిచిన ధాన్యాన్ని వెంటనే కొనాలని ఆదేశించారు.

అదే విధంగా మొక్కజొన్న కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. పశు సంపద , ఇళ్లు నష్టపోయిన బాధితులను కూడా ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి స్పష్టం చేశారు. తుఫాను కారణంగా నష్టపోయిన ప్రతి రైతుకు నష్టపరిహారం చెల్లిస్తామని, దీని గురించి రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా నష్టపోయిన పంటలపై సర్వే నిర్వహించి సాయం అందిస్తామని తుమ్మల చెప్పారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లోని నష్టం తీవ్రతను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించనున్నట్లు మంత్రి తుమ్మల తెలిపారు. కాగా, ఈ రోజు నుంచి వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పంట నష్టాన్ని అంచనా వేసి.. ప్రతి రైతు పంట వివరాలను నమోదు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
ఈ రోజు సీఎం రేవంత్రెడ్డి వరంగల్, హుస్నాబాద్ ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. పంట నష్టం, తుపాను ప్రభావిత ప్రాంతాలను సీఎం పరిశీలిస్తారు. క్షేత్ర స్థాయిలో పర్యటించి ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఇప్పటికే మంత్రులకు ఆదేశించిన సీఎం.. ఏరియల్ సర్వే అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. పరిహారం పైన ప్రకటన చేసే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications