కృష్ణా బోర్డుకు తెలంగాణ లేఖ... నీటి కేటాయింపులపై సర్కార్ కీలక ప్రతిపాదన...
కృష్ణా నదీ జలాల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కృష్ణా బోర్డుకు లేఖ రాసింది. తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కృష్ణా జలాలను 50:50 నిష్పత్తిలో కేటాయించాలని బోర్డును కోరింది. కృష్ణా జలాల వాటాను ట్రిబ్యునల్ తేల్చేవరకు 2021-22 ఏడాదికి గాను రాష్ట్రానికి 50శాతం నీటిని కేటాయించాలని విజ్ఞప్తి చేసింది. ఏపీలోని ఇతర బేసిన్లకు కృష్ణా జలాలను తరలించకుండా చూడాలని పేర్కొంది. ఈ మేరకు నీటిపారుదల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్ రావు కేఆర్ఎంబీ ఛైర్మన్కు లేఖ రాశారు.
గతంలో రెండు రాష్ట్రాల మధ్య జరిగిన ఒప్పందాల ప్రకారం... తెలంగాణకు 290 టీఎంసీలు,ఆంధ్రప్రదేశ్కు 504 టీఎంసీలు కేటాయించబడ్డాయి. అయితే కృష్ణా నదీ పరివాహక ప్రాంతం ఎక్కువగా ఉండే తెలంగాణకు తక్కువ కేటాయింపులు జరపడంపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. కృష్ణా నదీ ఎక్కువ దూరం ప్రవహించే రాష్ట్రానికి తక్కువ నీళ్లను కేటాయించి... తక్కువ దూరం ప్రవహించే రాష్ట్రానికి ఎక్కువ కేటాయింపులు చేయడమేంటని ప్రశ్నిస్తోంది. రెండు రాష్ట్రాలకు సమంగా నీటి కేటాయింపులు జరపాలని డిమాండ్ చేస్తోంది.

మరోవైపు ఏపీ ప్రభుత్వం మాత్రం తెలంగాణ వాదనను తప్పు పడుతోంది. గత టీడీపీ హయాంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఆమోదంతోనే ఈ ఒప్పందం జరిగిందని గుర్తుచేస్తోంది. అప్పుడు 290 టీఎంసీలకు అంగీకరించి... ఇప్పుడు సగం వాటా కావాలని డిమాండ్ చేయడం వెనుక ఉద్దేశాలు వేరే ఉన్నాయని అంటోంది.
కృష్ణా నదిపై ఇరు రాష్ట్రాలకు చెందిన ప్రాజెక్టులన్నింటినీ బోర్డు పరిధిలోకి తీసుకొస్తూ ఇటీవలే కేంద్రం గెజిట్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. కృష్ణా జలాల పంపిణీకి సంబంధించి 2014 నుంచే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కసరత్తులు చేస్తున్నప్పటికీ అది ఇంకా ఓ కొలిక్కి రాలేదు. నదీ జలాలను మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు పంపిణీ చేయాలని తెలుగు రాష్ట్రాలు కోరినప్పటికీ కేంద్రం అందుకు అంగీకరించలేదు.
Recommended Video

మరోవైపు జలాల పున:పంపిణీకి కొత్త ట్రిబ్యునల్ అంశం తెర పైకి వస్తోంది. తెలంగాణకు దక్కాల్సిన న్యాయమైన వాటా దక్కాలంటే కొత్త ట్రిబ్యునల్ ద్వారానే సాధ్యమని రాష్ట్రం భావిస్తోంది.దీనిపై కేంద్రంతో సంప్రదింపులు జరిపే యోచనలో సీఎం కేసీఆర్ ఉన్నారు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాలు కూడా జరుగుతున్నందునా... సీఎం త్వరలోనే ఢిల్లీ వెళ్లి కేంద్ర పెద్దలను కలిసే అవకాశం ఉంది. అటు ఏపీ ప్రభుత్వం మాత్రం కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటును అంగీకరించకపోవచ్చు.












Click it and Unblock the Notifications