కేసీఆర్ కోర్టులో బంతి..!!
KCR: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సారథ్యంలో తమ ప్రభుత్వం ఏర్పాటై నేటితో ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజా పాలన విజయోత్సవాలను నిర్వహిస్తోంది రేవంత్ రెడ్డి సర్కార్. పండగ వాతావరణంలో ఈ వేడుకలు ఆరంభం అయ్యాయి. నేటి నుంచి మూడు రోజుల పాటు అంటే- ఈ నెల 9వ తేదీ వరకు ముమ్మరంగా కొనసాగనున్నాయి.
గత ఏడాది డిసెంబర్ 7వ తేదీన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్లో నిర్వహించిన ప్రమాణ స్వీకారోత్సవానికి కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే హాజరయ్యారు.

గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ సారథ్యంలో 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న భారత్ రాష్ట్ర సమితిని ఓడించి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకుని రాగలిగారాయన. రాష్ట్ర విభజన అనంతరం అధికారంలోకి రావడం కాంగ్రెస్ పార్టీకి ఇదే తొలిసారి కావడంతో ప్రజా పాలన విజయోత్సవాలను ఘనంగా జరుపుతోన్నారు. పండగ వాతావరణంలో ఇవి కొనసాగుతున్నాయి.
ఈ విజయోత్సవాల్లో భాగంగా సచివాలయంలో తెలంగాణ తల్లి భారీ విగ్రహాన్ని నిర్మించింది ప్రభుత్వం. ఈ విగ్రహాన్ని 9వ తేదీన రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. అదే రోజున సోనియా గాంధీ జన్మదినం కూడా కలిసి రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఈ విగ్రహం రూపురేఖలను కూడా ప్రభుత్వం ఇదివరకే ఆవిష్కరించింది.
అదే రోజున అన్ని జిల్లా కేంద్రాలు, నియోజకవర్గాల్లో తెలంగాణ పతాక ఆవిష్కరణ కార్యక్రమాలను నిర్వహించేలా చర్యలు తీసుకుంటోంది. మంత్రులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు.. ఈ వేడుకల్లో పాల్గొననున్నారు. జిల్లాల్లో పతాకావిష్కరణ కార్యక్రమాలను నిర్వహించనున్నారు.
తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను ఆహ్వానించింది ప్రభుత్వం. హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ స్వయంగా కేసీఆర్ను కలిశారు. ఈ వేడుకలకు హాజరు కావాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్కు శాలువ కప్పి గౌరవించారు కేసీఆర్.












Click it and Unblock the Notifications