తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం: ఇక నుంచి పదో తరగతి పరీక్షలు ఆరు పేపర్లే
హైదరాబాద్: తెలంగాణలో పదవ తరగతి పరీక్షలపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఆరు పేపర్లతో పదో తరగతి పరీక్షలు నిర్వహించాలన్న విద్యాశాఖ ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. ఇప్పటి వరకు 11 పేపర్లతో పది పరీక్షలు జరుగుతున్నాయి.
హిందీ మినహా మిగితా సబ్జెక్టులకు రెండు పేపర్లు చొప్పున పరీక్షలు ఉంటున్నాయి. అయితే, కరోనా వ్యాప్తి సమయంలో 2021 ఏడాది 11 పేపర్లకు బదులు 6 పేపర్లతో పదో తరగతి పరీక్షలు నిర్వహించాలని.. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఆ ఏడాది కోవిడ్ ఉద్ధృతి కారణంగా పరీక్షల నిర్వహణ సాధ్యం కాలేదు.

2022లో 6 పేపర్లతోనే పదో తరగతి పరీక్షలు నిర్వహించింది.ఇప్పుడు 2023లోనూ ఆరు పేపర్లకే పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
పదో తరగతి పరీక్ష విధానంపై సమీక్ష జరిపిన ఎన్సీఈఆర్టీ 11 రోజులపాటు పరీక్షలు నిర్వహించడం వల్ల విద్యార్థులపై ఒత్తిడి పెరుగుతోందని, వాటిని ఆరు పేపర్లకు కుదించాలని ప్రభుత్వానికి ప్రతిపాదించింది. పదో తరగతి విధి విధానాలను మారుస్తూ త్వరలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది.
నవంబర్ 1 నుంచి రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షలు ఎస్ఏ-1 జరగనున్నాయి. ఎస్ఏ(సమ్మేటివ్ అసెస్మెంట్)-1 కూడా పదో తరగతికి ఆరు పేపర్లతోనే పరీక్షలు నిర్వహించేలా షెడ్యూల్ రూపొందించారు.












Click it and Unblock the Notifications