తెలంగాణలో కరోనా వ్యాక్సిన్ తీసుకోకుంటే.. నో రేషన్..నో పింఛన్?
హైదరాబాద్: ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారిని నిర్మూలించే విషయంలో తెలంగాణ సర్కార్.. కాస్త కఠినంగానే వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ వైరస్ వ్యాప్తి చెందడం వల్ల ఇప్పటికే అనేక ఇబ్బందులను ఎదుర్కొంది. లాక్డౌన్లోకి వెళ్లింది. ఆర్థికంగా ఒడిదుడుకులకు లోనయింది. మహమ్మారిని నిర్మూలించడానికి వ్యాక్సినేషన్ కార్యక్రమం ఒక్కటే ప్రస్తుతానికి అందుబాటులో ఉంది. వ్యాక్సిన్ పట్ల భయాందోళనలు, అనుమానాలతో ఈ కార్యక్రమానికి దూరంగా ఉంటోన్న వారికి ప్రభుత్వం కన్నెర్ర చేసింది.

తక్షణ చర్యలకు..
ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలంటూ ప్రభుత్వం సూచిస్తున్నా, రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా ప్రచార కార్యక్రమాలను చేపట్టినప్పటికీ.. చాలామందిలో మార్పు రావట్లేదు. వ్యాక్సిన్ వేయించుకోవడానికి వెనుకాడుతున్నారు. అలాంటి వారి పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా- వ్యాక్సిన్ వేయించుకోని వారికి ప్రతినెలా చౌక ధరల దుకాణాల ద్వారా అందజేసే నిత్యావసర సరుకులు, పింఛన్ మొత్తాన్ని నిలిపివేయనుంది. ఈ దిశగా తక్షణ చర్యలకు దిగింది.

పింఛన్ కట్..రేషన్ కూడా
వ్యాక్సిన్ వేయించుకోని వారికి పింఛన్లను నిలిపివేసే కార్యక్రమాన్ని నవంబర్ 1వ తేదీ నుంచే అమలు చేయడానికి సమాయాత్తమౌతోంది. ఈ దిశగా వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. కరోనా వ్యాక్సిన్ వేయించుకోని వారికి రేషన్, పింఛన్ నిలిపి వేస్తామని వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. నవంబరు 1వ తేదీ నుంచి ఇది అమలులోకి వస్తుందని తెలంగాణ ఆరోగ్య విభాగం డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస రావు వెల్లడించారు.

40 లక్షల మంది వరకు సెకెండ్ డోస్ బ్యాలెన్స్..
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం జోరుగా సాగుతోంది. మొదటి డోస్ వేసుకుని కూడా సెకెండ్ డోస్ తీసుకోని వారు సుమారు 40 లక్షల మంది వరకు ఉన్నట్లు ప్రభుత్వం అంచనా వేస్తోంది. రెండో డోస్ తీసుకోవాల్సిన గడువు దాటిపోయినప్పటికీ.. వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందుకు రావట్లేదు. పెద్దగా ఆసక్తి చూపట్లేదు. దీనిపై వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు గ్రామస్థాయిలో ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ప్రజల్లో అవగాహనను కల్పించడానికి తమవంతు ప్రయత్నాలు చేస్తోన్నారు.

టీకాలు అందుబాటులో ఉన్నా..
అయినప్పటికీ- సెకెండ్ డోస్ తీసుకోవడానికి వారు ముందుకు రావట్లేదని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. తొలి డోస్ను తీసుకోవాల్సిన వారి సంఖ్య కూడా లక్షల్లోనే ఉంటోంది. చాలినన్ని వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నా, ప్రజల్లో నెలకొన్న భయాందోళనలను పోగొట్టడానికి, సెకెండ్ డోస్ కోసం ప్రోత్సహించినప్పటికీ.. ముందుకు రాకపోవడంతో కఠిన చర్యలు తీసుకోవడానికి అధికారులు సన్నద్ధమౌతోందని అంటున్నారు.

4,023 యాక్టివ్ కేసులు..
ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని.. ఈ నెలాఖరులోగా వ్యాక్సిన్ను తీసుకోని వారిపై కఠిన చర్యలకు దిగనున్నారు. ప్రతినెలా 1వ తేదీ, ఆ తరువాత అదజేసే రేషన్, పింఛన్ మొత్తాన్ని నిలిపివేయాలని నిర్ణయించారు. తెలంగాణలో ఇప్పటిదాకా నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,70,453కు చేరింది. ఇందులో 6,62,481 మంది రికవరీ అయ్యారు. 3,949 మంది మరణించారు. సోమవారం సాయత్రం విడుదల చేసిన బులెటిన ప్రకారం.. తెలంగాణలో 24 గంటల వ్యవధిలో కొత్తగా 179 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 104 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇద్దరు మరణించారు. యాక్టివ్ కేసులు 4,023గా రికార్డయ్యాయి.












Click it and Unblock the Notifications