హైదరాబాద్లో వంద శాతం వ్యాక్సినేషన్ కోసం... సర్కార్ యాక్షన్ ప్లాన్ ఇదే... 15 రోజుల్లో పూర్తి చేసేలా...
హైదరాబాద్లో వంద శాతం కోవిడ్ వాక్సినేషన్ కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాబోయే 10-15 రోజుల్లో ఈ లక్ష్యాన్ని చేరుకోవాలని భావిస్తోంది. ఇందుకోసం ఇంటింటికి తిరిగి సర్వే జరిపి 18 సంవత్సరాలపై బడిన అర్హత కలిగిన వ్యక్తులను గుర్తించి వ్యాక్సినేషన్ ఇవ్వనున్నారు. నగరంలోని కార్పోరేటర్లు,ఎమ్మెల్యేలు, జీహెచ్ఎంసీ, ఆరోగ్యశాఖల అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది సమన్వయంతో.. అన్ని కాలనీల్లో దీన్ని చేపట్టనున్నారు. గురువారం(ఆగస్టు 19) వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి, జీహెచ్ఎంసీ కమిషనర్, జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న నాలుగు జిల్లాల కలెక్టర్లు, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, డీఎంహెచ్వోలు, ఎస్పీహెచ్వోలతో దీనిపై వర్క్షాప్ నిర్వహణ జరిగింది.
ఈ సందర్భంగా సీఎస్ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ.. మొబైల్ వాక్సినేషన్కు మంచి స్పందన వస్తున్నట్లు తెలిపారు. అదే స్ఫూర్తితో ఇంటింటికి తిరిగి మిగిలిన వ్యక్తులకు వాక్సినేషన్ చేసేందుకు సిబ్బంది, మెటీరియల్తో కాలనీల వారీగా టీమ్లను ఏర్పాటు చేయాలని అధికారులను కోరారు. ఒక ఉద్యమంగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పారు.

దేశంలోనే 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసిన తొలి నగరంగా భువనేశ్వర్ నిలిచిన సంగతి తెలిసిందే. నగరంలో 18 ఏళ్లు పైబడిన జనాభా మొత్తానికి జులై 31 నాటికి వ్యాక్సిన్లు వేశారు. అంతేకాదు,1లక్ష మంది వలస కూలీలకు సైతం వ్యాక్సినేషన్ పూర్తి చేశారు. నగరంలో విస్తృతంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టి తక్కువ వ్యవధిలోనే ఈ టార్గెట్ను పూర్తి చేశారు.వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు భువనేశ్వర్ నగరంలో దాదాపు 55 వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో 30 కేంద్రాలు ప్రైమరీ హెల్త్ సెంటర్స్,కమ్యూనిటీ సెంటర్స్లలో ఏర్పాటు చేశారు. అలాగే మరో 15 ఇమ్యూనైజేషన్ సెంటర్స్ను,10 డ్రైవ్ ఇన్ వ్యాక్సినేషన్ పాయింట్స్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. బీఎంసీ మైక్రో ప్లానింగ్తో నగరంలో 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు.
ప్రస్తుతం భారత్లో 18 ఏళ్లు పైబడినవారి జనాభా దాదాపు 94 కోట్లు పైమాటే. వీరందరికీ వ్యాక్సిన్లు ఇవ్వాలంటే 188 కోట్ల డోసులు కావాలి. జులై పూర్తయ్యే నాటికి 47 కోట్ల డోసుల వ్యాక్సినేషన్ పూర్తయింది. ఈ లెక్కన ఏడాది చివరి నాటికి మొత్తం జనాభాకు వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేయడం కష్టంగానే కనిపిస్తోంది. 153 రోజుల్లో 141 కోట్ల వ్యాక్సిన్ డోసులు ఇవ్వాలంటే... సగటున రోజుకు 92 లక్షల మందికి వ్యాక్సిన్లు వేయాల్సి ఉంటుంది.
Recommended Video
అవసరానికి సరిపడా వ్యాక్సిన్ల సప్లై లేకపోవడం వల్లే వ్యాక్సినేషన్ ప్రక్రియ మందకొడిగా సాగుతోందని చెబుతున్నారు. అయితే అగస్టు,సెప్టెంబర్ మాసాల్లో దాదాపు 35 కోట్ల వ్యాక్సిన్ సప్లై జరుగుతుందని అంచనా వేస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఈ లెక్కన మరో 35 కోట్ల మందికి ఈ రెండు నెలల్లో వ్యాక్సినేషన్ పూర్తి చేస్తే... మిగతా 92 రోజుల్లో 106 కోట్ల మందికి వ్యాక్సిన్లు ఇవ్వాల్సి ఉంటుంది.రోజుకు సగటున 1కోటి 15లక్షల మందికి వ్యాక్సిన్లు ఇవ్వగలిగితే మొత్తం జనాభాకు వ్యాక్సినేషన్ పూర్తి చేయవచ్చు.












Click it and Unblock the Notifications