"సోనియా ఇచ్చిన రాష్ట్రంలో రాహుల్ హామీని అమలు చేశాం"
తెలంగాణలో తమ ప్రభుత్వం ఇంటింటికి తిరిగి ప్రజల స్వీయ ధ్రువీకరణ పత్రంతో సేకరించిన సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ కుల సర్వే దేశానికి రోల్ మోడల్ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సమగ్ర వివరాలతో.. క్షుణ్నంగా చేపట్టిన సర్వేకు సంబంధించి 88 వేల పేజీల డాటా తమ వద్ద ఉందని సీఎం తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ, కుల సర్వే (SEEEPC) చేపట్టిన తీరు.. ఆ సర్వే ఆధారంగా తెలంగాణ ప్రభుత్వం బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు, విద్యా, ఉపాధి రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ శాసనసభలో ఆమోదించిన బిల్లులను పార్లమెంట్లో ఆమోదానికి ఒత్తిడి తెచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు ఢిల్లీ ఏఐసీసీ కార్యాయలంలో గురువారం సాయంత్రం పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ కుల గణనకు హామీ ఇచ్చారన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత 2024, ఫిబ్రవరి 4వ తేదీతో సర్వేను ప్రారంభించి 2025, ఫిబ్రవరి 5వ తేదీనాటికి ఏడాది కాలంలో ఆ మొత్తాన్ని పూర్తి చేశామని సీఎం తెలిపారు. అందుకే ఫిబ్రవరి 4ను తెలంగాణలో సామాజిక న్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నామని సీఎం వెల్లడించారు. కులగణన చేపట్టే సమయంలో అనేక మంది అగ్ర కులాల నాయకులు తన వద్దకు వచ్చి అభ్యంతరాలు, సందేహాలు వ్యక్తం చేశారని.. కాలనుగుణంగా మార్పులకు అవకాశం ఇవ్వాలని వారికి సూచించినట్లు సీఎం తెలిపారు.
ప్రత్యేక రాష్ట్రం కోసం 60 ఏళ్ల పాటు పోరాటాలు జరిగాయని, అనేక మంది అమరులయ్యారని.. కానీ 2009, డిసెంబరు 9న ప్రకటన చేయడంతో పాటు తెలంగాణ ఇచ్చి తెలంగాణ ప్రజల కలను సోనియా గాంధీ నెరవేర్చారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అదే తెలంగాణలో కుల గణనపై రాహుల్ గాంధీ ఇచ్చిన హామీని తమ ప్రభుత్వం నెరవేర్చిందని సీఎం పేర్కొన్నారు. బీజేపీ నాయకులు చెప్పినవి ఏవీ చేయరని అందుకు విరుద్ధంగా గాంధీ కుటుంబం చెప్పిన ప్రతి మాటను నిలుపుకుంటుందని చెప్పారు. కుల గణనకు సంబంధించి తమ ప్రభుత్వం 56 ప్రశ్నలతో ప్రతి ఇంటికి, ప్రతి వ్యక్తి వద్దకు వెళ్లి సమాచారం సేకరించిందని, సర్వే సమయంలో అందుబాటులో లేనివారికి ఆన్ లైన్ ద్వారా, టోల్ ఫ్రీ ద్వారా నమోదు చేసుకునే అవకాశం కల్పించామని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు.

సర్వే ప్రకారం తెలంగాణలో బీసీలు 56.36 శాతం ఉన్నారని సీఎం తెలిపారు. సర్వేలో 3.9 శాతం మంది తమది ఏ కులం కాదని ప్రకటించుకున్నారని ఇది తెలంగాణలో సరికొత్త పరిణామమని సీఎం చెప్పారు. అదే సమయంలో వీరంతా ఎవరని సర్వే చేసిన వారు స్వతంత్ర నిపుణుల బృందం పరిశీలించగా వాళ్లంతా ఇంగ్లీష్ విద్యను అభ్యసించిన ఉన్నత విద్యావంతులన్నారు. సర్వే ప్రకారం తాము స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఒక బిల్లు, విద్యా, ఉపాధి అవకాశాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ మరో బిల్లు ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపించామని తెలిపారు.
బీజేపీ తొలి నుంచి బీసీలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని సీఎం విమర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లీగల్లీ కన్వెర్టెడ్ బీసీ అన్నారు. తాము కుల గణన చేపట్టమని రాజ్నాథ్ సింగ్ పార్లమెంట్లో చెప్పారని సీఎం గుర్తు చేశారు. రైతుల నల్ల చట్టాల విషయంలో రాహుల్ గాంధీ గళం విప్పిన తర్వాత మోదీ వాటిని రద్దు చేసి క్షమాపణ చెప్పారని ఇప్పుడు రాహుల్ గాంధీ మాట మేరకు తెలంగాణ ప్రభుత్వం కులగణన చేపట్టిన తర్వాత కేంద్రం కుల గణనకు అంగీకరించిందని ఇదంతా రాహుల్ గాంధీ ఘనతేనని సీఎం అన్నారు.
తాము చేపట్టిన సర్వే దేశానికి రోల్ మోడల్ అని ఇది తెలంగాణ మోడల్ అని, నేను దీనిని రేర్ (RARE) మోడల్ అంటున్నానని RARE అంటే ఏమిటో నేను త్వరలో వివరిస్తానని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రాహుల్ గాంధీ హామీ మేరకు తమ ప్రభుత్వం కుల గణన చేసి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లులను శాసనసభలో ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపించామని, ఇక వాటిని లోక్సభ, రాజ్యసభల్లో ఆమోదింపజేసేందుకు రాహుల్ గాంధీ, ఖర్గే నాయకత్వంలో పోరాడాలని ఎంపీలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తాను, తన మంత్రులు, శాసనసభ్యులతో జంతర్ మంతర్ లో పోరాడతానని.. మీరు పార్లమెంట్ లో పోరాడాలని సీఎం కోరారు.

కుల సర్వే, బీసీ బిల్లుల ఆమోదంపై హర్షం వ్యక్తం చేస్తూ సోనియా గాంధీ స్వహస్తాలతో లేఖ రాశారని.. ఆ లేఖ తనకు నోబెల్, ఆస్కార్, జీవితకాల సాఫల్య పురస్కారం (లైఫ్ టైమ్ అచీవ్మెంట్) అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. ఈ స్థానంలో ఉన్నా లేకున్నా ఆ లేఖ తనకు ప్రత్యేకంగా మిగిలిపోతుందని సీఎం పేర్కొన్నారు.
తెలంగాణ కులగణన దేశానికి మైలు రాయి
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సర్వే దేశానికి ఒక మైలురాయి వంటిదని లోక్ సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ అభివర్ణించారు. కుల గణన విషయంలో రేవంత్ రెడ్డి, ఆయన బృందం తన అంచనాలకు మించి పని చేసిందని రాహుల్ గాంధీ ప్రశంసించారు. కుల గణన అంతతేలికైన అంశం కాదని, తెలంగాణలో కుల గణనకు ప్రోత్సహించినప్పుడు సీఎం రేవంత్ రెడ్డికి ఈ అంశం కష్టమని భావించానన్నారు. ముఖ్యమంత్రి సామాజిక వర్గం కూడా సర్వేకు అంగీకరించకపోయి ఉండవచ్చుననుకున్నాన
ని, కానీ రేవంత్ రెడ్డి మనస్ఫూర్తిగా, సమర్థంగా సర్వే చేశారని తెలిపారు.
తెలంగాణలో తలుపులు మూసిన పరిపాలన గదుల నుంచి కుల గణన చేయలేదని, అన్ని సామాజికి వర్గాలకు చెందిన లక్షలాది మంది తెలంగాణ ప్రజలు ఈ సర్వేలో పాల్గొనేందుకు తలుపులు తెరిచారన్నారు. 1950, 60, 70 దశకాల్లో అధికారం, శక్తి ఎక్కడి నుంచి వస్తుందని ప్రపంచ దేశాలను ప్రశ్నిస్తే ఆయిల్ అనే సమాధానం వచ్చేదని రాహుల్ గాంధీ అన్నారు. ఈ కాలం ఆధిపత్యం, అధికారం, శక్తి డాటా (సమాచారం) అని చెబుతారని, అలాంటి 21వ శతాబ్ధానికి కావాల్సిన సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ, కుల సర్వే తెలంగాణ ప్రభుత్వం దగ్గర ఉందని రాహుల్ గాంధీ తెలిపారు.
ఈ డాటాతో గ్రామీణ, జిల్లా స్థాయిల్లో సామాజిక, ఆర్థిక, విద్యా, ఆరోగ్యం ఇలా ఏరంగాల్లోనైనా అభివృద్ధి ఫలాలు అందించవచ్చునన్నారు. ఇలాంటి లక్ష్యిత అభివృద్ధి అందించే అవకావం దేశంలో తెలంగాణకు తప్ప మరే రాష్ట్రానికి లేదని సగర్వంగా చెబుతున్నానని రాహుల్ అన్నారు. ప్రజలకు మేలు చేసే ఈ సర్వేను బీజేపీ వ్యతిరేకిస్తుందని, ఆ పార్టీ విద్యా, ఉద్యోగాల్లో, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను వ్యతిరేకిస్తోందని రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
దేశాభివృద్ధికి డబ్బు, భూములు కాదని... ఇంగ్లీష్ విద్యనే మార్గమని రాహుల్ గాంధీ అన్నారు. తెలంగాణ కుల గణనలో ఈ విషయం స్పష్టంగా వెల్లడైందన్నారు. ఈ సర్వేకు ముందు భూములే విలువైనవని తాను అనుకునేవాడినని, కానీ ఇంగ్లీష్ ప్రాధాన్యమైన అంశంపై కుల గణన నిపుణుల కమిటీ చెప్పినప్పుడు ఆశ్చర్యం కలిగించిందన్నారు. ఇంగ్లీష్ అవసరం ఉన్నా హిందీ, ఇతర ప్రాంతీయ భాషలు అక్కర్లేదని తాను చెప్పడం లేదని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఏ బీజేపీ నేతను ప్రశ్నించినా ఇంగ్లీష్ వద్దంటారని, వారి పిల్లలు ఏ స్కూల్, కాలేజీలో చదువుతున్నారని ప్రశ్నిస్తే మాత్రం ఇంగ్లీష్ మీడియం అనే సమాధానమే వస్తుందన్నారు. మరి ఆ అవకాశాన్ని దేశంలోని వెనకబడినవర్గాలైన ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ లకు ఎందుకు ఇవ్వరని బీజేపీ నేతలను రాహుల్ గాంధీ ప్రశ్నించారు.
కుల గణన, ఓబీసీలకు రిజర్వేషన్లు తనకు, సీఎం రేవంత్ రెడ్డికి జాబ్ అని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఆ డేటాతో తెలంగాణ ప్రజల జీవితాల్లో మార్పులు తేవాలనుకుంటున్నట్లు ఆయన తెలిపారు. దేశ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని తాము నిరతంతరం ఆలోచిస్తుంటే, తెలంగాణలో సాగుతున్న ఆలోచనలను అడ్డుకోవాలని బీజేపీ చూస్తోందని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం విద్యా, ఉద్యోగాలు,
స్థానిక సంస్థల్లో 50 శాతం రిజర్వేషన్ల గోడను బద్దలు కొడుతూ కేంద్రానికి పంపిన బిల్లులను బీజేపీ అడ్డుకుంటోందని రాహుల్ అన్నారు. ఈ అంశంపై పార్లమెంట్ వేదికగా పోరాడడమే ప్రస్తుతం మన ముందున్న లక్ష్యమని ఎంపీలను ఉద్దేశించి రాహుల్ గాంధీ అన్నారు.
దేశానికి తెలంగాణ సర్వే దిశానిర్దేశం
తెలంగాణ ప్రభుత్వం చేసిన కుల గణన దేశానికి దిశానిర్దేశం చేసిందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రశంసించారు. కుల గణన చేపట్టడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న సాహసోపేతమైన చర్యగా ఆయన అభివర్ణించారు. భారత్ జోడో యాత్రలో ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణలో కుల గణనను ప్రోత్సహించిన లోక్ సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీని ప్రత్యేకంగా ప్రశంసించారు. కుల గణన అంశాన్ని లేవనెత్తడమే కాకుండా, జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ నినాదంతో రాజ్యాంగాన్ని కాపాడటానికి రాహూల్ కారణమని అన్నారు. రాహుల్ గాంధీ ఒత్తిడితోనే ప్రధానమంత్రి మోదీ దేశ వ్యాప్త జన గణనలో కుల గణనను చేస్తామని దిగిరాక తప్పలేదన్నారు.
ఏఐసీసీ కార్యాలయంలో సర్వేపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చి ప్రసంగించారు. పీసీసీ అధ్యక్షుడు కార్యక్రమ సంధానకర్తగా వ్యవహరించారు. సమావేశంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, ఏఐసీసీ అగ్ర నేతలు దిగ్విజయ్ సింగ్, జైరాం రమేశ్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి, కాంగ్రెస్ పార్టీ లోక్సభ, రాజ్యసభ ఎంపీలు, స్వతంత్ర నిపుణుల కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) కేసీ వేణుగోపాల్తో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ తదితరులు ఖర్గే నివాసంలో గురువారం ఉదయం భేటీ అయ్యారు. SEEEPC సర్వే ప్రక్రియ, శాసనసభలో బిల్లుల ఆమోదం, పార్లమెంట్లో వాటి ఆమోదంపై చర్చించారు.
-
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications