గవర్నర్ పై తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం..!?
గవర్నర్ వర్సస్ తెలంగాణ ప్రభుత్వ పోరాటం కొత్త మలుపు తీసుకుంది. గవర్నర్ పైన ప్రభుత్వం మరో పోరాటానికి సిద్దమవుతోంది.
గవర్నర్ వర్సస్ తెలంగాణ ప్రభుత్వం ఎపిసోడ్ కొత్త టర్న్ తీసుకుంది. గవర్నర్ తో పెరుగుతున్న దూరం ఇప్పుడు న్యాయస్థానంకు చేరుతోంది. ఈసారి గవర్నర్ చర్యలపై ప్రభుత్వం ఏకంగా హైకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించినట్లు సమాచారం. మరో నాలుగు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 3న ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశ పెట్టాలని నిర్ణయిచింది. ఇందుకు గవర్నర్ ఆమోదం తెలపాల్సి ఉంది. కానీ, ఇప్పటి వరకు అనుమతి రాలేదు. ఇదే సమయంలో గవర్నర్ కార్యాలయం నుంచి ప్రభుత్వానికి ఒక రిటర్న్ కమ్యూనికేషన్ వెళ్లింది. ఈ నేపథ్యంలో ఈ రోజు హైకోర్టులో ప్రభుత్వం గవర్నర్ ను బడ్జెట్ కు అనుమతించేలా ఆదేశించాలని కోరుతూ ప్రభుత్వం లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేయనుంది. దీంతో..ఇప్పుడు ఈ వ్యవహారం మరింత ఆసక్తి కరంగా మారుతోంది.
ప్రభుత్వం వర్సస్ గవర్నర్
కొంత కాలంగా తెలంగాణలో ప్రభుత్వం వర్సస్ గవర్నర్ అన్నట్లుగా పరిస్థితి మారింది. ఇప్పుడు మరింత దూరం పెరిగింది. ప్రభుత్వ తీరు పైన ఢిల్లీలో..ఇటు రాజ్ భవన్ వేదికగా గవర్నర్ ఓపెన్ గానే తన ఆగ్రహం వ్యక్తం చేసారు. కీలక వ్యాఖ్యలు చేసారు. ఇటు ప్రభుత్వంలోని మంత్రుల నుంచి గవర్నర్ తీరు పైన అభ్యంతరం చేస్తూ వ్యాఖ్యలు వినిపించాయి. ఇదే సమయంలో తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో గత ఏడాది గవర్నర్ ప్రసంగం లేకుడానే బడ్జెట్ సమావేశాలు జరగటం.. బడ్జెట్ కు ఆమోదం జరిగాయి. ఈ సారి మరో నాలుగు రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో బడ్జెట్ కు గవర్నర్ ఆమోదం కోసం ప్రభుత్వం ఈ నెల 21న గవర్నర్ కు లేఖ పంపింది. దీనిని ఇప్పటి వరకు గవర్నర్ ఆమోదించ లేదు. ఇదే సమయంలో సమావేశాల ప్రారంభంలో గవర్నర్ ప్రసంగం కాపీ పంపాలంటూ ప్రభుత్వానికి లేఖ పంపింది. దీంతో..ఇప్పుడు గవర్నర్ ఆమోదం పైన హైకోర్టును ఆశ్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
హైకోర్టులో లంచ్మోషన్ పిటిషన్
గవర్నర్ ప్రసంగం లేకుండా అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అసెంబ్లీ ప్రోరోగ్ కాలేదని, గవర్నర్ ప్రసంగం అవసరం లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇదే సమయంలో బడ్జెట్ ఆమోదం పై గవర్నర్ నిర్ణయం తీసుకోకపోవటంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గవర్నర్ ఆమోదం తరువాతనే కేబినెట్ సమావేశంలో బడ్జెట్ ను మంత్రివర్గం ఆమోదించనుంది. ఆ తరువాతనే అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టాల్సి ఉంటుంది. దీంతో..సమయం సమీపిస్తుండటంతో హైకోర్టును ఆశ్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు లంచ్మోషన్ పిటిషన్ దాఖలు చేయనుంది. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవేను అందుకోసం రంగంలోకి దించింది. ప్రజాపద్దును శాసనసభలో ప్రవేశపెట్టేందుకు తక్షణమే అనుమతించేలా గవర్నర్కు ఆదేశాలివ్వాలని హైకోర్టును కోరనుంది. ఈ పిటిషన్ చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ తుకారాంజీ నేతృత్వంలోని మొదటి కోర్టుకు వచ్చే అవకాశం ఉంది.
హైకోర్టు నిర్ణయంపై ఉత్కంఠ
గవర్నర్ పైన ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించటంతో ఇప్పుడు న్యాయస్థానం ఏం చెబుతుందనే దాని పైన ఉత్కంఠ కనిపిస్తోంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 202 ప్రకారం బడ్జెట్ను శాసనసభలో ప్రవేశపెట్టేందుకు గవర్నర్ ఆమోదం తెలపాల్సివుంటుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. గవర్నర్ ఆమోదం చెప్పటం రాజ్యాంగపరమైన విధిగా ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. గవర్నర్ ప్రసంగం అంశం అత్యవసరం కాదని చెబుతున్నాయి. దీంతో..ఇప్పుడు న్యాయస్థానం ముందుకు గవర్నర్ పైన ప్రభుత్వం దాఖలు చేస్తున్న పిటీషన్ విచారణకు రానుంది. న్యాయస్థానం గవర్నర్ విషయంలో ఏం చెప్పబోతోంది..ప్రభుత్వ వాదనలపైన న్యాయస్థానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడు ప్రభుత్వ - రాజకీయ వర్గాల్లో ఉత్కంఠను పెంచుతోంది.