రుణమాఫీ మార్గదర్శకాలు సిద్దం - అమలయ్యేది వీరికే..!!
తెలంగాణ ప్రభుత్వం రైతు రుణమాఫీ అమలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. రైతు రుణమాఫీ విధి విధానాలను ప్రభుత్వం మంగళవారం విడుదల చేయనున్నట్టు తెలిసింది. ఆగస్టు15 లోగా రైతులకు సంబంధించిన రూ.2 లక్షల రుణాలను మాఫీ చేస్తామని, ఇందుకు రూ.31 వేల కోట్ల నిధులు అవసరమవుతాయని అంచనా వేస్తున్నారు. ప్రతీ కుటుంబానికి రేషన్ కార్డు ప్రామాణికంగా రుణమాఫీ అమలు చేయనున్నారు. ఎవరికి అమలు చేయాలనే అంశం పైన ఒక నిర్ణయానికి వచ్చారు.
తుది కసరత్తు
ఇప్పటికే రుణమాఫీ విధి విధానాల రూపకల్పన తుది దశకు చేరుకున్నట్టు తెలిసింది. దీనిపై ఇటు వ్యవసాయ, అటు ఆర్థిక శాఖ అధికారులు కుస్తీ పడుతున్నారు. ఆగస్టు 15లోపు రైతులకు సంబంధించిన రూ.2 లక్షల రుణాలను మాఫీ చేస్తామని, ఇందుకు రూ.31 వేల కోట్ల నిధులు అవసరమని తేల్చారు. ఈ నేపథ్యంలో నిధుల సమీకరణపై ఆర్థిక శాఖ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. నిధులు సమకూరే మార్గాల పైన అధికారులు అన్వేషిస్తున్నట్టు సమాచారం. ఇందులో భాగంగా నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్సీడీసీ) నుంచి రుణం తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది.

షరుతులు వర్తిస్తాయి
అదే సమయంలో ఇతర మార్గాలను కూడా అన్వేషిస్తున్నట్టు సమాచారం. ఇక..రుణమాఫీ అమలు కోసం తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలోనే నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం ఖరారు చేస్తున్న విధి విధానాల్లో ప్రధానంగా కొన్ని షరతులు అమలు చయనున్నారు. రేషన్ కార్డు ప్రాతిపదికంగా కుటుంబలో ఎంత మంది రుణం తీసుకున్నా..కుటుంబానికి రూ 2 లక్షలు గరిష్ఠంగా నిర్ణయించారని సమాచారం. అదే విధంగా పీఎం కిసాన్ పథకంలోని కొన్ని నిబంధనలను రుణమాఫీకి వర్తింపచేయనున్నట్టు తెలిసింది. లబ్దిదారుల సంఖ్యలోనూ కోతలు ఉండే అవకాశం కనిపిస్తోంది.
వీరికి వర్తించదు
పాస్బుక్ జత చేసి బంగారం కుదువపెట్టి తీసుకున్న రుణాలకు రుణమాఫీ వర్తించబోదని ఇప్పటికే సీఎం రేవంత్రెడ్డి స్పష్టంచేశారు. ప్రజా ప్రతినిధులు, రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారు, ఐటీ చెల్లించేవారిని రుణమాఫీకి అనర్హులుగా ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలిసింది. అయితే, నిజమైన రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, వారికి కచ్చితంగా రుణమాఫీ జరిగేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. అయితే...రుణమాఫీ అమల్లో భాగంగా ప్రభుత్వం అధికారికంగా ఖరారు చేసే విధి విధానాల పైన రైతుల్లో ఉత్కంఠ కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications