రైతు భరోసా పెండింగ్ నిధులు, ఉద్యోగుల బకాయిల చెల్లింపు - తాజా ముహూర్తం..!!
తెలంగాణ ప్రభుత్వం పెండింగ్ హామీల అమలు పైన కసరత్తు చేస్తోంది. రైతులు.. ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిల పైన తాజాగా నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఉద్యోగుల కు ఇచ్చిన హామీ అమలుకు నిధులు అవసరం. అదే విధంగా మెట్రో నిర్వహణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటోంది. దీంతో.. పాటుగా సంక్షేమ పథకాల అమలు కోసం ఒత్తిడి పెరుగుతోంది. దీంతో.. రాష్ట్ర ఆర్దిక పరిస్థితి పూర్తిగా సహకరించని పరిస్థితుల్లో ప్రభుత్వం వీటికి నిధుల సర్దుబాటు పైన కీలక నిర్ణయం తీసుకుంది.
తెలంగాణ ప్రభుత్వం పథకాలు.. కార్యక్రమాల కొనసాగింపు కోసం ఆర్దికంగా ఉన్న ఇబ్బందులను అధిగమించేందుకు రూ 12 వేల రుణం సేకరించాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ బాండ్లను వేలానికి పెట్టాలని రిజర్వు బ్యాంకుకు పంపిన ప్రతిపాదనల్లో కోరింది. వీటి వేలం ద్వారా సమకూరిన మొత్తం రూ.12 వేల కోట్లను రాబోయే 6 నుంచి 25 ఏళ్లలో తిరిగి చెల్లిస్తామని తెలిపింది. వీటిని 7 శాతం నుంచి 7.5 శాతం వడ్డీకే తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది.

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న రైతు భరోసాలో ఇప్పటికే తొలి విడత కింద రూ. 3,446.94 కోట్లు విడుదల (68.89 లక్షల మందికి)... రెండో విడత: రూ. 2,206.06 కోట్లు (45.11 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి) జమ చేసింది. మూడో విడత కింద వచ్చే నెల మరో రూ. 3,300 కోట్లు విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందు కోసం నిధుల సేకరణ అవసరంగా మారుతోంది. కాగా.. రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు, ఆర్టీసీకి నిధులు సమకూర్చడం తదితర కార్యక్రమాలకు భారీగా డబ్బు అవసరం.
రుణ సేకరణ ద్వారా హామీల అమలు
అదే విధంగా పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు దాదాపు రూ 6,200 కోట్లు ఉన్నాయి. వచ్చే నెల నుంచి భూముల రిజిస్ట్రేషన్ ఫీజులు పెంచడం ద్వారా ఆదాయం సమకూరితే పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, పాత బకాయిల చెల్లింపులకు మరిన్ని నిధులు అందుబాటులోకి వస్తాయనేది ఆర్థిక శాఖ అంచనా వేస్తోంది. కాగా.. ఇదే సమయంలో హైదరాబాద్ మెట్రో స్వాధీనం చేసుకోవటానికి ప్రభుత్వం సిద్దమైంది.
ఇందు కోసం ఐఆర్ఎఫ్ఎసీ రుణం ఇవ్వగా మిగిలిన మొత్తాన్ని హెచ్ఎండీఏ(హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ) ద్వారా సమకూర్చనున్నారు. మొత్తం రూ 15 వేల కోట్లు మెట్రోకు సేకరించాల్సి ఉంది. దీంతో.. తాజా పరిస్థితులు అధ్యయనం చేసిన ప్రభుత్వం రానున్న రెండు నెలల కాలంలో రూ 12 వేల కోట్ల రుణ సమీకరణకు నిర్ణయించింది.












Click it and Unblock the Notifications