కీలక ప్రకటన జారీ చేసిన రేవంత్ రెడ్డి
Revanth Reddy: అమెరికాలోని చికాగోలో హైదరాబాద్కు చెందిన విద్యార్థి సయ్యద్ మజర్ అలీపై జరిగిన దాడిపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను కలిచి వేసిందని వ్యాఖ్యానించారు. ఈ వరుస ఘటనలు ఆందోళనలు కలిగిస్తోన్నాయని పేర్కొన్నారు.
హైదరాబాద్ లంగర్ హౌస్కు చెందిన సయ్యద్ మజర్ అలీ.. మాస్టర్స్ డిగ్రీ చేయడానికి చికాగో వెళ్లారు. అక్కడి ఇండియానా వెస్లియన్ యూనివర్శిటీలో చదువుకుంటోన్నారు. అమెరికా కాలమానం ప్రకారం సోమవారం అర్ధరాత్రి దాటిన తరువాత ఆయనపై గుర్తు తెలియని నలుగురు వ్యక్తులు దాడి చేశారు. ఆయన వద్ద ఉన్న మొబైల్, పర్స్ ఇతర వస్తువులను దోచుకున్నారు.

ఈ దాడిలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. రక్తమోడుతున్న స్థితిలో కనిపించారు. తల, ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. స్నేహితులు, పోలీసులు అతన్ని స్థానిక ఆసుపత్రిలో చేర్చారు. ఈ ఘటనపై లంగర్ హౌస్లో ఉంటోన్న మజర్ అలీ కుటుంబీకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు పునావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం స్పందించారు. ఈ దాడి తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని పేర్కొన్నారు. ఇటీవలే ఓహియోలో శ్రేయాస్ రెడ్డి అనే హైదరాబాద్ విద్యార్థిపైనా ఇలాగే గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని, ఈ ఘటనలో ఆయన మరణించాడని గుర్తు చేశారు.
ఇలాంటి అవాంఛనీయం సంఘటనలు చోటు చేసుకోకుండా అన్ని చర్యలు తీసుకోవాలంటూ విదేశాంగ శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్కు విజ్ఞప్తి చేశారు. అమెరికా సహా ఇతర దేశాల్లో నివసిస్తోన్న వారికి, ప్రత్యేకించి విద్యార్థులకు తామున్నామనే భరోసాను కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు.
ఈ వరుస దాడులను దృష్టిలో పెట్టుకుని ఓ స్పెషల్ డెస్క్ను ఏర్పాటు చేస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. అమెరికా సహా ఇతర దేశాల్లో నివసిస్తోన్న యువత, విద్యార్థులకు సత్వర సహాయాన్ని అందించడానికి ఈ చర్య చేపట్టనున్నామని అన్నారు. ఈ ప్రపంచంలో ఎక్కడ నివసిస్తోన్నా సరే.. ఈ హెల్ప్ డెస్క్ ద్వారా వారికి అవసరమైన సహాయ సహాకారాలను అందిస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications