శ్రీశైలం హక్కు మాకే: హరీష్, తప్పు చేస్తే: ఎర్రబెల్లి
హైదరాబాద్: శ్రీశైలం ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తి పైన తాము కృష్ణా బోర్డుకు సమాధానం చెప్పామని, శ్రీశైలం పైన హక్కులు తమకే ఉంటాయని తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు బుధవారం చెప్పారు. తెలంగాణలో విద్యుత్ కష్టాలకు పదేళ్ల కాంగ్రెస్ పాలననే కారణమన్నారు. తెలంగాణలో పంటలు ఎండిపోకూడదనే తాము విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నామని చెప్పారు.
తెలంగాణ బీజేపీ, తెలంగాణ టీడీపీ నేతలు ఇక్కడి రైతుల కోసం విద్యుత్ ఎందుకు అడగటం లేదని ప్రశ్నించారు. విభజన చట్టాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గౌరవించడం లేదని ఆరోపించారు. విద్యుదుత్పత్తితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎలాంటి నష్టం లేదన్నారు. చంద్రబాబు అడుగడుగునా తెలంగాణకు ద్రోహం చేస్తున్నారన్నారు.
విద్యుత్ సమస్యలను తప్పకుండా పరిష్కరిస్తామని, తాము విద్యుత్ పైన ప్రణాళికాబద్దంగానే వెళ్తున్నామన్నారు. కృష్ణా బోర్డుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం లేఖ రాసిందో తమకు తెలియదన్నారు. లేఖలో తమ ముఖ్య కార్యదర్శి సరైన జవాబే రాశారని తెలిపారు.
ముక్కు నేలకు రాస్తాం: ఎర్రబెల్లి
విద్యుత్ విషయంలో చంద్రబాబు నాయుడు తప్పు చేశాడని నిరూపిస్తే తాము ముక్కు నేలకు రాస్తామని తెలంగాణ టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర రావు అన్నారు. విద్యుత్ పైన అఖిల పక్షం ఎందుకు వేయడం లేదన్నారు. చంద్రబాబు తప్పు చేశాడని నిరూపిస్తే దేనికైనా సిద్ధమన్నారు.
కడుపు మండిన రైతులు దాడి చేశారు: జీవన్ రెడ్డి
నల్గొండలో టీడీపీ కార్యాలయం పైన కడుపు మండిన రైతులే దాడి చేశారని కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వేరుగా అన్నారు. చంద్రబాబు తెలంగాణ వ్యతిరేకి అని ఆరోపించారు. ఆయన విద్యుత్ అడ్డుకుంటున్నారని విమర్శించారు. శ్రీశైలం ప్రాజెక్టు కట్టిందే విద్యుత్ ఉత్పత్తి కోసమన్నారు. తాగు, సాగు నీరు పేరుతో విద్యుత్ ఆపాలని చూస్తున్నారన్నారు.
తమకు రావాల్సిన విద్యుత్ తమకు ఇవ్వడం లేదన్నారు. టీటీడీపీ నేతలు బాబు కుట్రలను నిలువరించాలని హితవు పలికారు. తమ సీఎల్పీ నేత జానా రెడ్డి బాగా పని చేస్తున్నారని కితాబిచ్చారు. తెరాస, టీడీపీ ఆధిపత్య పోరు మధ్య ప్రజలు కష్టాలు పడుతున్నారని ధ్వజమెత్తారు. యువతను ప్రభుత్వం మరిచిపోయిందని తెలంగాణ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. అవరవీరుల కుటుంబాలను ప్రభుత్వం గుర్తించాలని సూచించారు.