వచ్చే మూడు నెలలు మహా డేంజర్ ... కరోనా కష్టకాలం .. తెలంగాణా హెల్త్ డైరెక్టర్ హెచ్చరిక
తెలంగాణ రాష్ట్రంలో కరోనాను పూర్తిగా జయించలేదని, రాబోయే మూడు నెలల కాలమంతా కరోనా కష్టకాలం అంటూ , అందరూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందంటూ హెచ్చరికలు జారీ చేశారు తెలంగాణ రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు. తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నప్పటికీ, అసలు గడ్డుకాలం అంతా ముందే ఉందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం కరోనాను పూర్తిగా జయించలేదని, చలికాలం కరోనా వైరస్ వ్యాప్తికి అనుకూలమైన కాలం కాబట్టి, వేగంగా వైరస్ వ్యాప్తి చెందుతుంది అంటూ ఆయన హెచ్చరిస్తున్నారు.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కరోనా కంటే డేంజరస్ వైరస్ .. చంద్రబాబు ఫైర్
చలికాలం , పండుగలతో కరోనా వ్యాప్తి చెందే అవకాశం
పండుగ నేపథ్యంలో కూడా కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా జరిగే అవకాశం ఉందంటున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరమని ఆయన సూచిస్తున్నారు. కోవిడ్ వ్యాక్సిన్ రావడానికి చాలా సమయం పడుతుంది అని పేర్కొన్న తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు అప్పటివరకు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందన్నారు. మాస్కులు ధరించాలని, చేతులను శానిటైజ్ చేసుకోవాలని, సామాజిక దూరాన్ని తప్పనిసరిగా పాటించాలని ఆయన పేర్కొన్నారు.
కరోనా కారణంగా మహిళలు, పిల్లల కంటే పురుషులకే ఎక్కువ ప్రమాదం
కరోనా కారణంగా మహిళలు, పిల్లల కంటే పురుషులకే ఎక్కువ ప్రమాదం పొంచి ఉందని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు హెచ్చరిస్తున్నారు. కరోనా నివారణ చర్యల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పిన ఆయన తప్పనిసరిగా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఎలాంటి అనుమానం ఉన్న వెంటనే పరీక్షలు చేయించుకోవాలని చెప్తున్నారు. సొంత వైద్యం చేసుకోవడం మంచిది కాదని పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కరోనా లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయొద్దంటున్నారు.
నిర్లక్ష్యంగా ఉంటే ముప్పు తప్పదని హెల్త్ డైరెక్టర్ హెచ్చరిక
చలికాలంలో కరోనా వ్యాప్తికి ఎక్కువ అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కరోనా సామాజిక వ్యాప్తి దశ కొనసాగుతుందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలోనూ ప్రజలను అప్రమత్తం చేయడానికి తెలంగాణ రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు రాష్ట్రంలో కరోనా పరిస్థితి వివరించి , ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తగు సూచనలు ఇచ్చారు. ఇప్పటికే ప్రజలు బయట రోడ్లపై మాస్కులు లేకుండా, సామాజిక దూరం పాటించకుండా తిరుగుతున్నారు . ఇక చలికాలంలో ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశం ఉండటంతో ప్రజలు నిర్లక్ష్యంగా ఉంటే పెను ప్రమాదమే పొంచి వున్నట్టు అవుతుంది.