బండి సంజయ్ పాదయాత్రకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్: రేపట్నుంచి యాత్ర ప్రారంభం
హైదరాబాద్: బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రకు హైకోర్టు అనుమతినిచ్చింది. పాదయాత్ర ఆపాలని పోలీసులు ఇచ్చిన నోటీసు సస్పెండ్ చేస్తున్నట్లు ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. పోలీసుల నోటీసులు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని న్యాయస్థానం అభిప్రాయపడింది.
హైకోర్టు ధర్మాసనం ఆదేశాలతో బండి సంజయ్ శుక్రవారం నుంచి పాదయాత్రను నిర్వహించనున్నారు. ఆగస్టు 23న బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రను నిలిపివేయాలని పోలీసులు నోటీసులు జారీచేసిన విషయం తెలిసిందే. పాదయాత్ర ప్రముఖ్ డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్లకు వర్దన్నపేట ఏసీపీ ఈ నోటీసులు ఇచ్చారు.

జనగామ జిల్లాలో ప్రజాసంగ్రామ యాత్రకు అనుమతి లేదని ఈ నోటీసులో పేర్కొన్నారు. పాదయాత్ర పేరిట విద్వేషపూరిత ప్రకటనలు చేస్తున్నారని, ధర్మదీక్ష పేరుతో వివిధ జిల్లాల నుంచి భారీ ఎత్తున జన సమీకరణ చేస్తున్నారని పేర్కొన్నారు. రెచ్చగొట్టే ప్రకటనలతో, ఇతర జిల్లాల నుంచి కార్యకర్తలను రప్పిస్తుండటంతో జిల్లాలో శాంతిభద్రతల విఘాతం ఏర్పడే ప్రమాదం ఉందని తెలిపారు. ఈ ఈ కారణంగా తక్షణమే ప్రజా సంగ్రామ యాత్రను నిలిపేయాలని నోటీసులో స్పష్టం చేశారు.
నోటీసును పరిగణలోకి తీసుకోకుండా తిరిగి ప్రజా సంగ్రామ యాత్రను ప్రారంభిస్తే శాంతిభద్రతల సమస్య కింద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. అయితే పాదయాత్రను అనుమతించాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు బీజేపీ నేతలు. విచారణ జరిపిన హైకోర్టు.. బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో బండి సంజయ్ శుక్రవారం నుంచి పాదయాత్ర ఎక్కడ ఆగిందో అక్కడ్నుంచే పాదయాత్ర చేయనున్నారు. మరోవైపు, ఆగస్టు 27న వరంగల్ భద్రకాళి ఆలయం వద్ద భారీ బహిరంగ సభను నిర్వహించనుంది.












Click it and Unblock the Notifications