తెలంగాణా హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు .. డైనమిక్ సీఎం కేసీఆర్ సమస్యను 10 నిముషాల్లో పరిష్కరిస్తారట
తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ పై తెలంగాణ హై కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. సీఎం కేసీఆర్ డైనమిక్ గా వ్యవహరిస్తారని విన్నామని, ఏ సమస్యకైనా పదినిమిషాల్లో పరిష్కారం చూపగలరు అని తెలిసిందని వ్యాఖ్యానించింది. హైదరాబాద్ కార్మిక నగర్ లోని కళ్యాణ్ నగర్ కోఆపరేటివ్ సొసైటీ కి సంబంధించిన కేసులో హైకోర్టు ధర్మాసనం ఈ తరహా వ్యాఖ్యలు చేసింది.
ముప్ఫైఏండ్ల క్రితం అప్పటి ప్రభుత్వం.. ఆక్రమణకు గురైన భూమిని తమకు కేటాయించిందని, దాని స్థానంలో వేరే భూమి కేటాయించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ హైదరాబాద్ కార్మికనగర్లోని కల్యాణ్నగర్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ కోర్టును ఆశ్రయించింది. ప్రత్యామ్నాయంగా భూమిని కేటాయించాలంటూ గతంలో కోర్టులు ఇచ్చిన తీర్పులను అమలుచేయకపోవడంతో సొసైటీ సభ్యులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై గురువా రం విచారణ జరిపిన హైకోర్టు.. ప్రభుత్వ ప్రత్యేక ప్రధానకార్యదర్శి రాజేశ్వర్ తివారిని హాజరుకావాలని ఆదేశించింది.
దీంతో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారి కోర్టుకు హాజరయ్యారు. సొసైటీకి ప్రత్యామ్నాయ భూమిని కేటాయించడంలో క్యాబినెట్ నిర్ణయం అవసరమని, 8 వారాల గడువు ఇవ్వాలంటూ ఆయన ధర్మాసనాన్ని కోరారు. దీనికి స్పందించిన హైకోర్టు ధర్మాసనం బాధిత సొసైటీ సభ్యులు 30 ఏండ్లుగా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని, నెలరోజుల్లో సరైన నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ డైనమిక్గా వ్యవహరిస్తున్నట్టు విన్నామని.. ఆయన ఈ సమస్యకు 10 నిమిషాల్లో పరిష్కారం చూపగలరని వ్యాఖ్యానించింది. తదుపరి విచారణను మార్చి 29కి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. మరి దశాబ్దాలుగా కోర్టు చుట్టూ తిరుగుతున్న కళ్యాణ్ నగర్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ వారి సమస్య ను సీఎం కేసీఆర్ ఏ మేరకు పరిష్కరిస్తారో వేచి చూడాలి.