మభ్య పెడుతున్నారా... ఆదివారం టెస్టుల సంఖ్య తగ్గడమేంటి... తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు అసహనం...
కరోనా వైరస్ వ్యాప్తి మొదలైన నాటి నుంచి తెలంగాణ ప్రభుత్వ చర్యలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్న హైకోర్టు తాజాగా మరోసారి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. ప్రభుత్వం వెల్లడిస్తున్న రోజువారీ హెల్త్ బులెటిన్లో మరణాల సంఖ్య నమ్మశక్యంగా లేదని హైకోర్టు అభిప్రాయడింది. మార్చి నుంచి ఇప్పటివరకూ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగినా... ప్రతీరోజూ మరణాల సంఖ్య 9 లేదా 10 మాత్రమేనని ప్రభుత్వం బులెటిన్స్లో వెల్లడిస్తుండటం అనుమానాస్పదంగా ఉందని పేర్కొంది. కరోనా పేషెంట్లకు మెరుగైన వైద్యం, వైద్య సిబ్బంది రక్షణకు చర్యలు చేపట్టేలా ఆదేశించాలంటూ దాఖలైన 19 పిల్స్ను ప్రభుత్వం విచారించింది.
చర్యలకు ఎందుకు వెనకాడుతున్నారు...?
కరోనా రోగుల మరణాలపై ప్రభుత్వం వెల్లడిస్తున్న లెక్కల్లో మరింత స్పష్టత అవసరమని హైకోర్టు వెల్లడించింది. ఇకనుంచి స్పష్టమైన,సమగ్రమైన సమాచారం అందించాలని ఆదేశించింది. అంతేకాదు, మరణాల పై వాస్తవాలను తెలుసుకునేందుకు ప్రత్యేక కమిటీతో విచారణ జరిపించాల్సి ఉంటుం దని పేర్కొంది. కరోనా వైద్య సేవలకు సంబంధించి ఇప్పటివరకూ 161 ఫిర్యాదులు అందాయని,38 ఆస్పత్రులకు నోటీసులు ఇచ్చామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ... ఆ సమాచారంలో స్పష్టత లేదని హైకోర్టు పేర్కొంది. ఏ రకమైన ఫిర్యాదులు వచ్చాయి... ఏ ఆస్పత్రికి ఎప్పుడు నోటీసులిచ్చారు అన్న వివరాలేవీ అని ప్రశ్నించింది. ప్రైవేట్ ఆస్పత్రులపై చర్యలకు వెనకాడటాన్ని తప్పు పట్టింది.
మభ్య పెడుతున్నారా...
ఓవైపు కేసుల సంఖ్య పెరుగుతుంటే గత ఆదివారం పరీక్షల సంఖ్యను 50శాతం తగ్గించారని హైకోర్టు పేర్కొంది. ప్రభుత్వ తీరు ప్రజలను మభ్యపెట్టేలా ఉందని... పాజిటివ్ కేసులు తక్కువగా ఉన్నాయని చెప్పే ప్రయత్నం చేస్తున్నట్లుగా కనిపిస్తోందని అభిప్రాయపడింది. ఆదివారం జనం పెద్దగా రాకపోవడంతోనే కరోనా టెస్టులు తగ్గాయన్న వాదనను కోర్టు తప్పు పట్టింది. నిజానికి ఆదివారం సెలవు దినం కాబట్టి... ఆరోజే ఎక్కువమంది రావడానికి అవకాశం ఉంటుందని పేర్కొంది. ఆ లెక్కన ఆదివారం టెస్టుల సంఖ్య పెరగాల్సిందిపోయి తగ్గడమేంటని ప్రశ్నించింది. గతంలో ఆదివారాల్లో చేసిన కరోనా టెస్టుల నివేదికలను సమర్పించాలని కోరింది.
Recommended Video
విచారణకు కొద్ది నిమిషాల ముందు నివేదిక...
హైకోర్టులో విచారణ ప్రారంభమవడానికి కేవలం 3 నిమిషాల ముందు ప్రభుత్వం నివేదికను సమర్పించడంపై న్యాయస్థానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. 20 రోజుల వాయిదా తర్వాత ఈ కేసును విచారిస్తున్నామని... నివేదిక సమర్పించేందుకు అంత గడువు సరిపోలేదా అని ప్రశ్నించింది. కోర్టు ముందుకు ఎప్పుడొచ్చినా లోపాలతో కూడిన నివేదికలే ఇస్తున్నారని.... ఇదేంటని ప్రశ్నిస్తే వచ్చే విచారణకు సమగ్ర నివేదిక అందిస్తామని చెప్తారని... ఆ తర్వాత కూడా అదే తీరును కనబరుస్తారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అరకొరా సమాచారాన్ని సమర్పించడం ద్వారా ప్రభుత్వ నివేదికలపై నమ్మకం పోయే పరిస్థితి ఏర్పడిందన్నారు.