కేటీఆర్ వాహనానికి ట్రాఫిక్ పోలసుల ఫైన్ - వారిని పిలిపించిన మంత్రి : ఊహించని విధంగా..!!
తెలంగాణ ప్రభుత్వంలో నెంబర్ టు ఆయన. అధికార పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్. అటువంటి మంత్రి కేటీఆర్ ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించారంటూ ఏకంగా జరిమానా విధించారు. చలాను రాసారు. గాంధీ జయంతి నాడు జరిగిన ఈ ఘటన వైరల్ అయింది. రాంగ్ రూట్ లో వచ్చినందుకు ఆ చలాన్ ను రాయగా.. దానిని చెల్లించేందుకు కేటీఆర్ అంగీకరించారు. అయితే, ఆ ట్రాఫిక్ సిబ్బంది చేసిన పనితో దీని పైన పోలీసు సిబ్బందిలో నూ చర్చ సాగింది. అయితే, అనూహ్యంగా కేటీఆర్ ఈ పరిణామం పైన స్పందించారు.
తన వాహనానికి ట్రాఫిక్ చలాన్ వేసిన ఎస్ఐ ఐలయ్య, కానిస్టేబుల్ వెంకటేశ్వర్లను పిలిపించారు. రాంగ్ రూట్లో వచ్చిన మంత్రి వాహనానికి సైతం నిబంధనల ప్రకారం.. చలాన్ విధించిన ట్రాఫిక్ సిబ్బందిని మంత్రి తన కార్యాలయానికి పిలిపించి సన్మానించారు. నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ సమక్షంలో ఆ ఇద్దరినీ కేటీఆర్ శాలువా కప్పి సత్కారించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడంలో తాను ఎల్లవేళలా ముందుంటానని.. చలాన్ విధించిన రోజు వాహనంలో తాను లేనని మంత్రి పేర్కొన్నారు.
సామాన్య ప్రజలు అయినా.. అధికారంలో ఉన్న ప్రజా ప్రతినిధులైనా.. నిబంధనలు అందరికీ ఒక్కటే అని చెబుతూ.. నిబంధనలు పాటించిన తన వాహనానికి జరిమానా విధించటాన్ని సమర్ధించారు. అయితే, బాపుఘాట్లో నిర్వహించిన గాంధీ జయంతి కార్యక్రమం సందర్భంగా అనుకోని పరిస్థితుల్లో రాంగ్ రూట్లో వచ్చిందన్నారు. వా విధి నిర్వహణలో నిజాయితీగా వ్యవహరించే ఐలయ్య లాంటి అధికారులకు ఎప్పుడూ తాము అండగా ఉంటామన్నారు. మంత్రి కేటీఆర్ తన వాహనానికి విధించిన చలాన్ను సైతం చెల్లించారు.
తన వాహనానికి ట్రాఫిక్ చలాన్ వేసిన ఎస్ఐ ఐలయ్య, కానిస్టేబుల్ వెంకటేశ్వర్ల ను అభినందించిన మంత్రి @KTRTRS #ktr #oneindiatelugu pic.twitter.com/vxADQN7ehF
— oneindiatelugu (@oneindiatelugu) October 4, 2021
ఈ విషయంలో తమ పార్టీ కార్యకర్తలు నాయకులకు సరైన సందేశం అందించేందుకు ఇవాళ ట్రాఫిక్ సిబ్బందిని అభినందించిన విషయాన్ని పార్టీ శ్రేణులు గుర్తించాలని మంత్రి సూచించారు. అదే విధంగా నిబంధనల ప్రకారం పని చేసే సిబ్బందికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని చెప్పారు. తమ విధుల నిర్వహణలో ఎటువంటి ఒత్తిడిని పట్టించుకోకుండా నిర్భయంగా పని చేయాలని మంత్రి కేటీఆర్ స్పష్టం చేసారు. వారిలో స్పూర్తి నింపే ప్రయత్నం చేసారు.
ఇక, తాజాగా హైదరాబాద్ లో భారీ వర్షాల సమయంలో ఒక వ్యక్తి నాళాలో పడి మరణించారు. ఆ వ్యక్తి కోసం రెండు రోజుల పాటు మున్సిపల్ సిబ్బంది గాలించారు. దీని పైన మంత్రి స్పందించారు. మంత్రిగా తన బాధ్యతల గురించి కేటీఆర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు సైతం వైరల్ అయ్యాయి. ఇప్పుడు తన వాహనానికి చలాన్ రాసిన సిబ్బందిని పిలిచి సత్కరించటం ద్వారా కేటీఆర్ సోషల్ మీడియాలో నెటిజెన్ల ప్రశంసలు అందుకుంటున్నారు.