కరోనా లాక్ డౌన్ దెబ్బకు అప్పుల్లో తెలంగాణా: కేంద్రం ఆదుకోకుంటే కష్టమే !!
తెలంగాణా రాష్ట్రంలో కరోనా లాక్డౌన్ కారణంగా ఆర్ధిక కష్టాలు కొనసాగుతున్నాయి. ఇక కరోనాకు ముందే ఆర్ధిక మందగమనం ఎఫెక్ట్ తో తెలంగాణా రాష్ట్రంలో ఆర్ధిక పరిస్థితి దారుణంగా మారింది. ఇక ఇప్పుడు కరోనాపై పోరాటంలో భాగంగా లాక్డౌన్ విధించడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ నెలలో కూడా ఆర్ధిక ఇబ్బందులు తప్పేలా లేదు. ఇప్పటికే ఆర్ధిక పరిస్థితుల నేపధ్యంలో ఉద్యోగుల జీతాల్లో సగం కోత విధించింది తెలంగాణా సర్కార్ . ఇక గత రెండు నెలల కాలంలో కరోనా పంజా విసరటంతో ఇబ్బంది తలెత్తింది .

ఆర్ధిక కష్టాల్లో తెలంగాణా .. కేంద్ర సాయం కోసం ఎదురుచూపు
ఇక ఏప్రిల్ తో పోల్చుకుంటే మే లో పరిస్థితి కాస్త నయం అయినప్పటికీ అది రాష్ట్ర అవసరాలను తీర్చేంతగా లేదనే చెప్పాలి. ఇక ఈ నేపధ్యంలో ఇప్పటికే పలుమార్లు కేంద్రాన్ని సాయం అందించి ఆదుకోవాలని తెలంగాణా సర్కార్ కోరింది . లాక్ డౌన్ తో అన్ని మూత పడడంతో రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం ఆగిపోయింది. వేల కోట్లలో ఆదాయం రావాల్సిన చోట వంద కోట్లలో కూడా ఆదాయం సమకూరలేదు. కేంద్రం సహాయం కోసం పదే పదే విజ్ఞప్తి చేసినా పెద్దగా స్పందన లేదు. ఇప్పటికే అన్ని రాష్ట్రాలు కరోనా దెబ్బకు కేంద్ర సాయం కోసం ఆశగా ఎదురు చూస్తున్నాయి. కేంద్రం పరిస్థితి కూడా అంతే అగమ్య గోచరంగా తయారైంది .

అప్పుల బాట పట్టిన తెలంగాణా
ఇక కేంద్రం నుండి గత నెలలో తెలంగాణ రాష్ట్రానికి రావలసిన వాటా రూ.14 వందల కోట్లు రావాల్సి ఉంటే రూ.982 కోట్లు మాత్రమే వచ్చింది. ఇక ఈ నెల పరిస్థితి ఏంటో ? ఎంత వస్తుందో తెలియదు. దీంతో తెలంగాణా సర్కార్ ఆర్ధిక ఇబ్బందుల నుండి గట్టెక్కటానికి అప్పులు చెయ్యాల్సిన పరిస్థితి . మొదట లాక్ డౌన్ ప్రారంభం అయిన మార్చి నెల నుండి మొన్నటి వరకు మద్యం దుకాణాలు మూత పడి ఉండడంతో ఆదాయం రాలేదు. ఈ నెలలో ఎక్సయిజ్, రిజిస్ట్రేషన్స్ ద్వారా కాస్త ఆదాయ వనరులు సమకూరే అవకాశం ఉంది.

ఈ నెలలో మద్యం , రవాణా, రిజిస్ట్రేషన్ కార్యాలయాల ద్వారా ఆదాయం
గత నాలుగు రోజుల్లో రూ.640 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. దీంతో ప్రభుత్వానికి కాస్త ఆర్ధిక ఉపశమనం కలుగుతుంది . ఇక రవాణా, రిజిస్ట్రేషన్ కార్యాలయాలు కూడా పూర్తి స్థాయిలో పని చేస్తున్నాయి. అక్కడి నుండి కూడా ఆదాయం ఓ మోస్తరుగా వచ్చే అవకాశం ఉంది. ఇక ఇతర పనులు, షాపులు నిర్వహించుకునే వారికి ఊరట ఇవ్వటం ద్వారా జనాలు రోడ్ల మీదకు వస్తున్నారు. దీంతో జనసంచారం పెరగడంతో పెట్రోల్, డీజిల్ అమ్మకాలు కూడా పెరిగే అవకాశం ఉంది. ప్రభుత్వం రుణమాఫీకి నిధులు , రైతు బంధు పథకానికి కూడా నిధులు ఇస్తానని ప్రకటించింది. రేషన్ కార్డు దారులకు డబ్బులు, పెన్షన్స్ ఇతర సంక్షేమ కార్యక్రమాలకు కూడా ప్రభుత్వానికి డబ్బులు అవసరం.
Recommended Video

గత నెల అప్పు రూ.4 వేల కోట్లు... ఈ నెల మరో రూ. 2 వేల కోట్లు అప్పు యోచన
తెలంగాణా ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరం మొదటి నెల ఏప్రిల్ లోనే ప్రభుత్వం రూ.4 వేల కోట్లు అప్పు తీసుకుంది. ఈ నెల లో మరో రూ. 2 వేల కోట్లు తీసుకోవాలని డిసైడ్ అయింది. ఇక ఇప్పటికే ఆర్ధిక వనరుల కోసం బాండ్స్ ని వేలానికి పెట్టింది. ప్రభుత్వం నడవాలంటే, ప్రభుత్వ సంక్షేమ పథకాలకు , జీతాలకు ఇతర ఖర్చులకు డబ్బు కావాల్సి ఉంటుంది . దీంతో ప్రభుత్వం అప్పు చేయాల్సిన పరిస్థితిలో పడింది. ఏది ఏమైనా కరోనా లాక్ డౌన్ తెలంగాణా సర్కార్ ను తీవ్ర అప్పుల్లోకి నెట్టింది . ఈ పరిస్థితుల్లో అయినా కేంద్రం కరవ చూపాలని కోరుతుంది.












Click it and Unblock the Notifications