‘ఆత్మహత్య చేసుకుంటా’: ఇంటర్ ఫలితాల వివాదం, 50శాతానికిపైగా ఫెయిల్, విద్యార్థుల ఆందోళన
హైదరాబాద్: తెలంగాణలో గురువారం విడుదలైన ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాలు వివాదాస్పదంగా మారాయి. ఉత్తీర్ణత శాతం భారీగా తగ్గడంపై విద్యార్ధులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది 60 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా.. ఈ ఏడాది కేవలం 49 శాతం మంది మాత్రమే పాసవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
నెల రోజులే టైమిచ్చి.. ఇంతమందిని ఫెయిల్ చేస్తారా?
మరీ ఇంత తక్కువ శాతం పాసవడమేంటంటూ తల్లిదండ్రులు, విద్యార్ధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా టైమ్లో విద్యార్ధులు ఎన్నో ఇబ్బందులు పడి పరీక్షలు రాస్తే.. మరీ ఇంత తక్కువ మందిని పాస్ చేస్తారా? అంటూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఇంటర్ బోర్డును నిలదీస్తున్నారు. పేపర్ వాల్యుయేషన్ కఠినంగా చేశారనీ.. టాప్ క్లాస్ స్టూడెంట్స్ కూడా ఫెయిల్ అయ్యారంటూ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కేవలం నెల రోజులే టైమ్ ఇచ్చి పరీక్షలు పెట్టారని విద్యార్థి సంఘం ఎస్ఎఫ్ఐ మండిపడుతోంది. ఇంటర్ బోర్డు నిర్లక్ష్యం కారణంగానే ఇంత మంది ఫెయిల్ అయ్యారంటూ విద్యార్థి సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి.
కరోనా పరిస్థితుల కారణంగా విద్యార్థులు చదవలేకపోయారు.. కానీ..
గత మార్చిలో కరోనా ఉధృతి కారణంగా ప్రభుత్వం పరీక్షలు లేకుండానే ఫస్ట్ ఇయర్ విద్యార్థులను రెండో సంవత్సరంలోకి ఇంటర్ బోర్డు ప్రమోట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కరోనా ప్రభావం కాస్త తగ్గడంతో మళ్లీ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించింది. అప్పుడు కూడా ఇంటర్ బోర్డ్ పై తల్లిదండ్రులు, విద్యార్థుల నుంచి ఆగ్రహం వ్యక్తమైంది. కరోనా ప్రత్యేక పరిస్థితుల వల్ల విద్యార్థులు సరిగా చదవలేకపోయారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆన్లైన్ క్లాసులు సరిగా అర్థం కాలేదంటున్నారు. ఈ పరిస్థితుల్లో పరీక్షలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై కొందరు కోర్టుకు కూడా వెళ్లారు. అయితే సమయం తక్కువగా ఉండటంతో పరీక్షల నిర్వహణకే కోర్టు ఓకే చెప్పింది. దీంతో పరీక్షలను నిర్వహించారు ఇంటర్ బోర్డు అధికారులు.
ఇంటర్ బోర్డ్ కార్యాలయం విద్యార్థుల ఎదుట ఆందోళన
తెలంగాణలో గురువారం విడుదలైన ఇంటర్ ఫస్టియర్ ఫలితాలపై విద్యార్థుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద విద్యార్థి సంఘాలు శుక్రవారం పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి. చదువు చెప్పకుండా విద్యార్థులను ప్రభుత్వం ఫెయిల్ చేయించిందని విద్యార్థి సంఘాలు ఆరోపించాయి. ఇంటర్నెట్ కనెక్షన్ లేక చాలామంది పేద విద్యార్థులు తరగతులకు హాజరు కాలేకపోయారని, ఫెయిలైన వారందరినీ పాస్ చేయాలని డిమాండ్ చేశాయి. దీంతో ఆందోళన చేస్తున్న విద్యార్థులు, విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు పోలీస్ స్టేషన్కు తరలించారు. కాగా ఇంటర్ ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం తగ్గడానికి ప్రభుత్వ విధానాలే కారణమని ఎస్ఎఫ్ఐ నేతలు ఆరోపించారు. తాము వద్దని డిమాండ్ చేస్తున్నా పరీక్షలు నిర్వహించి ఇప్పుడు విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుకుంటున్నారని మండిపడ్డారు. కనీస మార్కులతో అయినా విద్యార్థులను పాస్ చేయించాలని వారు డిమాండ్ చేశారు. ఇంటర్ బోర్డు నిర్లక్ష్యానికి విద్యార్థులు బలవుతున్నారని... ఇప్పటికే రాష్ట్రంలో పలువురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని ఎస్ఎఫ్ఐ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆత్మహత్య చేసుకుంటానంటూ విద్యార్థి ట్వీట్.. చివరకు
ఇది ఇలావుండగా, ఓ విద్యార్థి తాను ఆత్మహత్యకు చేసుకుంటానని సోషల్ మీడియాలో పేర్కొన్నాడు. అందర్నీ పాస్ చేస్తామని చెప్పి.. తనను ఇంటర్ మొదటి సంవత్సరంలో నాలుగు సబ్జెక్టులు ఫెయిల్ చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. అంతేగాక, తన ఆత్మహత్యకు మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి కారణమంటూ ఆ మంత్రుల ట్విట్టర్ ఖాతాలను జతచేశాడు. దీంతో క్షణాల్లోనే ఇంటర్ విద్యార్థి చేసిన ట్వీట్ వైరల్ అయ్యింది. దీంతో విద్యాశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. విద్యార్థి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. అయితే కాసేపటి తర్వాత ఇంటర్ విద్యార్థి 'తాను బాగానే ఉన్నా' అంటూ రీట్వీట్ చేయడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. తన సూసైడ్ ఎటెంప్ట్ నిర్ణయాన్ని మార్చుకున్నానని.. తనను మోటివేట్ చేసిన అందరికీ కృతజ్ఞతలు అంటూ సదరు విద్యార్థి తెలపడంతో అందరూ కుదుటపడ్డారు.