ఆ నగరాలలో పెట్టుబడులపై శుభవార్త చెప్పిన మంత్రి దుద్దిళ్ళ.. త్వరలో వారికోసం కొత్తవిధానం!
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో పెట్టుబడులే లక్ష్యంగా ఎంతగానో కృషి చేస్తుంది. గత రెండు సంవత్సరాల్లో రూ.70 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, వీటి ద్వారా సుమారు రెండు లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభించాయని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ప్రకటించారు. తాజాగా శాసనసభలో సభ్యుల ప్రశ్నలకు సమాధానమిస్తూ ఆయన ఈ వివరాలు వెల్లడించారు.
దావోస్లో రూ.5.86 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి 108 ఒప్పందాలు కుదుర్చుకున్నామని, అవన్నీ కార్యరూపం దాలుస్తున్నాయని మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు తెలిపారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో కుదుర్చుకున్న ఎంవోయూలలో 23 శాతం, దావోస్ ఒప్పందాల్లో దాదాపు 45 శాతం కార్యకలాపాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు.

గత రెండేళ్లలో హైదరాబాద్లో 75కి పైగా గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లు ప్రారంభమయ్యాయని, డేటా సెంటర్ల ఏర్పాటు ద్వారా కూడా భారీ పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు. అయితే కేవలం హైదరాబాద్ మాత్రమే కాకుండా ద్వితీయ స్థాయి నగరాలపై కూడా దృష్టి పెట్టామని మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు అన్నారు.
హైదరాబాద్పై ఒత్తిడిని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీ పరిశ్రమలను విస్తరిస్తున్నామని, త్వరలో ఆదిలాబాద్లో ఐటీ టవర్ను ప్రారంభించనున్నామని, నిజామాబాద్ ఐటీ హబ్లో కంపెనీలు కార్యాలయాలు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామని మంత్రి వెల్లడించారు.
జీసీసీలు, డేటా సెంటర్ల కోసం త్వరలో కొత్త విధానం తీసుకురానున్నట్లు కూడా ప్రకటించారు.రాష్ట్రంలోని యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం అన్ని విధాలా కృషి చేస్తున్నామని చెప్పారు.తమ ప్రభుత్వం హరిత పరిశ్రమలను ఏర్పాటు చేస్తుందన్నారు. గత ప్రభుత్వంలా కాలుష్యాన్ని వెదజల్లే రెడ్ కేటగిరీ పరిశ్రమలను తాము ఏర్పాటు చేయటం లేదని మంత్రి దుద్దిళ్ళ పేర్కొన్నారు.
గత ప్రభుత్వం నిర్మించిన ఐటీ హబ్లు, టవర్లను వినియోగంలోకి తెస్తున్నామని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పారిశ్రామికవేత్తలను భయపెట్టి అభివృద్ధిని అడ్డుకుంటోందని విమర్శించారు. ఫ్యూచర్ లేని పార్టీ ఫ్యూచర్ సిటీ గురించి మాట్లాడటం హాస్యాస్పదం అన్నారు. హైదరాబాద్-బెంగళూరు రహదారిని రక్షణ కారిడార్గా ప్రకటించాలని కేంద్రాన్ని కోరారు.












Click it and Unblock the Notifications
