గవర్నర్ నోటితో బీజేపీకి చురకలు -నం.1 రాష్ట్రంగా తెలంగాణ -అసెంబ్లీలో తమిళిసై కీలక ప్రసంగం
తెలంగాణలో ఉపఎన్నిక, జీహెచ్ఎంసీ ఫలితాల తర్వాత జోరుమీదున్న బీజేపీ నిత్యం ఏదో ఒక ఇష్యూపై రచ్చ చేస్తూ కేసీఆర్ సర్కారును ఇరుకునపెట్టే ప్రయత్నాలు చేస్తుండటం, ఏ చిన్న సమస్య వచ్చినా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చెంతకు వెళ్లి గోడు చెప్పుకోవడం కమలనాథులకు అలవాటైన వేళ.. అదే గవర్నర్ నోటితో కాషాయ పార్టీకి చురకలు వేయించారు ముఖ్యమంత్రి కేసీఆర్...
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్ తమిళిసై సోమవారం ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రభుత్వమే తయారు చేసిన సదరు ప్రసంగంలో రాష్ట్ర ప్రగతితోపాటు రాజకీయపరమైన పలు అంశాలు కూడా ఉన్నాయి. దాదాపు అన్ని రంగాల్లో తెలంగాణ అగ్రగామిగా కొనసాగుతున్నదని, అన్ని వర్గాల ప్రజల పురోగతికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని గవర్నర్ చెప్పారు.

గంగా జమున సంస్కృతి విలసిల్లిన తెలంగాణలో మత సామరస్యానికి టీఆర్ఎస్ సర్కారు కట్టుబడి ఉంటుందని, అన్ని మతలాలకు సమాన ఆదరణ, న్యాయం లభిస్తోందని గవర్నర్ తమిళిసై అన్నారు. ఔషధ నగరిగా హైదరాబాద్కు ఖ్యాతి లభించిందని, కరోనా విలయకాలంలో హైదరాబాద్ నుంచే టీకాలు, మందులను ఉత్పత్తి చేస్తుండటం గొప్ప విషయమన్నారు.
అభివృద్ధి విషయంలో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా ఉందని, ధాన్యం సేకరణలో మొదటి స్థానంలో (64 లక్షల టన్నుల ధాన్యం సేకరణ)తో నిలవగా, ఈ-ట్రాన్సాక్షన్లో దేశంలోనే రెండో స్థానంలో ఉన్నామని గవర్నర్ గుర్తుచేశారు. త్వరలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తవుతుందని, కొత్త మున్సిపల్ , రెవెన్యూ చట్టంతో పాలనలో సమూలమైన మార్పులు జరగనున్నాయని, ధరణి పోర్టల్ ద్వారా విప్లవాత్మక సంస్కరణలు తీసుకువచ్చామని ఆమె పేర్కొన్నారు.
టీఎస్ ఐపాస్ ద్వారా 15,252 పరిశ్రమలకు అనుమతి ఇచ్చామని, హైదరాబాద్కు మరో మణిహారంలో రీజనల్ రింగ్ రోడ్ ను మలుస్తున్నామని, మిషన్ భగీరథ ద్వారా ఫ్లోరైడ్ సమస్యను అధిగమించామని, ఆధునాతన పద్దతుల ద్వారా సైబర్ నేరాలను నివారిస్తున్నామని, దేశంలోని మొత్తం సీసీ కెమెరాల్లో 68 శాతం రాష్ట్రంలోనే ఉన్నాయని, సీసీ కెమెరాల వినియోగంపై హైదరాబాద్ ప్రపంచంలోనే 16వ స్థానంలో ఉందని గవర్నర్ తెలిపారు.

ఆరున్నర ఏళ్ల మేధోమథనం ఫలితంగానే తెలంగాణ దూసుకెళ్తోందన్న గవర్నర్.. రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలు, పరిష్కారంపై ప్రభుత్వం దృష్టిసారించిందని, వనరులను పూర్తిగా సద్వినియోగం చేసుకుంటూ, ఏడాదికి రాష్ట్ర తలసరి ఆదాయం రూ.2 లక్షల 28 వేలకు పెరిగిందని తెలిపారు. ఆర్థిక నిర్వహణలో సర్కారు క్రమశిక్షణ పాటిస్తున్నదని, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి 20లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చామని, భక్త రామదాసు ప్రాజెక్ట్ 7 నెలల్లో పూర్తి చేసి, త్వరలోనే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ పనిపడతామని తమిళిసై అన్నారు.
తెలంగాణలో మొత్తంగా 2.10 కోట్ల ఎకరాల్లో పంటల సాగులోకి వచ్చిందని, మొత్తం 39,36,521 మందికి పెన్షన్లు అందిస్తున్నామని, ఇందుకోసం ప్రతి ఏటా రూ.8,710 కోట్లు కేటాయింపులున్నాయని, ప్రతి గ్రామంలో నర్సరీ, డంప్యార్డు, రైతువేదిక, స్మశానవాటిక, హరిత వనాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పట్టణ ప్రగతి ద్వారా మున్సిపాలిటీలను అభివృద్ధి చేస్తున్నామని గవర్నర్ తెలిపారు. గవర్నర్ ప్రసంగం తర్వాత అసెంబ్లీ వాయిదా పడింది. ఈనెల 18న ఆర్థిక మంత్రి హరీశ్ రావు బడ్జెట్ ప్రవేశపెడతారు.












Click it and Unblock the Notifications