సమ్మె విరమించిన తెలంగాణ జూడాలు: మంత్రి దామోదర కీలక హామీలు
హైదరాబాద్: తమ డిమాండ్ల సాధన కోసం గత కొద్దిరోజులుగా చేస్తున్న సమ్మెను జూనియర్ డాక్టర్లు గురువారం విరమించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో జూడాలు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. దీంతో జూనియర్ డాక్టర్లు సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు. వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హామీతో జూడాలు సమ్మెను విరమించారు.
మొత్తం 8 డిమాండ్లలో ఆరింటికి సానుకూలంగా మంత్రి దామోదర స్పందించారు. మంత్రి సానుకూల స్పందనతో జూడాలు సమ్మెను విరమించారు. అనంతరం హైదరాబాద్లో జూడాలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడారు. జూడాలు ఉస్మానియా, గాంధీ ఆసుపత్రి వసతి గృహాలపై ఫిర్యాదు చేశారని తెలిపారు.

వసతి గృహాల్లో సౌకర్యాలు మెరుగుపరచాలని కోరారని మంత్రి వెల్లడించారు. తమకు మరింత భద్రత కల్పించాలని జూడాలు కోరారన్నారు. జూనియర్ డాక్టర్లు లేవనెత్తిన సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారని తెలిపారు మంత్రి దామోదర. సీఎం ఆదేశాల మేరకు ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులను సందర్శించామని వెల్లడించారు. ఉస్మానియా ఆస్పత్రిలో సౌకర్యాల కోసం రూ.121 కోట్లు విడుదల చేశామని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు.
గాంధీ ఆస్పత్రి కోసం రూ.80 కోట్లు మంజూరు చేశామన్నారు వైద్యారోగ్యశాఖ మంత్రి రాజనర్సింహ. కాకతీయ ఆస్పత్రికి సీసీ రోడ్డు మంజూరు చేశామని వివరించారు. వైద్య సౌకర్యాలు మెరుగుపరిచేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు. ఇక, ఉస్మానియా ఆస్పత్రి విషయం కోర్టులో ఉందన్న మంత్రి.. ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవనాలు కట్టేందుకు తాము సానుకూలంగా ఉన్నామని తెలిపారు. ఉస్మానియా గురించి సరైన సమయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు.
పేదలకు వారివారి ప్రాంతాల్లోనే మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి దామోదర. వైద్యశాఖ విధానాల్లో కూడా మార్పులు తీసుకువస్తున్నామన్నారు. పేదల ప్రజలకు విద్య, వైద్యం అందించే బాధ్యత ప్రభుత్వానిదేనని అన్నారు. మందులు, హెల్త్ ల్యాబ్లను ఆధునీకరిస్తున్నామని వైద్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడించారు. ఆస్పత్రుల్లో మంచి భోజనం అందించాలని ఆదేశించామన్నారు.












Click it and Unblock the Notifications