భయపెడుతోన్న బ్లాక్ ఫంగస్... తెలంగాణ ప్రభుత్వం అలర్ట్... నోడల్ కేంద్రం ఏర్పాటు...
కరోనాతో పాటు బ్లాక్ ఫంగస్ కేసులు కూడా నమోదవుతుండటంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. బ్లాక్ ఫంగస్ సోకిన పేషెంట్ల చికిత్స నిమిత్తం నోడల్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. హైదరాబాద్లోని కోఠిలో ఉన్న ఈఎన్టీ ఆస్పత్రిని నోడల్ కేంద్రంగా ప్రకటించింది. బ్లాక్ ఫంగస్ పేషెంట్లకు ఇక్కడ చికిత్స అందించనున్నట్లు స్పష్టం చేసింది. బ్లాక్ ఫంగస్ బారినపడిన కరోనా బాధితులకు మాత్రం సికింద్రాబాద్లోని గాంధీ ఆస్పత్రిలో చికిత్స అందించనున్నారు.
తెలంగాణలోనూ 'బ్లాక్ ఫంగస్' కలకలం... భైంసాలో బయటపడ్డ 3 కేసులు... ఒకరి మృతి
బ్లాక్ ఫంగస్ చికిత్సకు ఉపయోగించే మెడిసిన్ను సమకూర్చాలని రాష్ట్ర ప్రభుత్వం టీఎస్ఎంఐడీసీకి ఆదేశాలు జారీ చేసింది. అలాగే కరోనా చికిత్స పొందుతున్న బాధితులకు బ్లాక్ ఫంగస్ సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రైవేట్ ఆస్పత్రులకు ఆదేశాలిచ్చింది. అవసరమైతే తప్ప కరోనా పేషెంట్లకు స్టెరాయిడ్స్ ఇవ్వవద్దని సూచించింది. బ్లాక్ ఫంగస్ సోకినవారిలో కళ్లు,ముక్కు,నోటిపై ఆ ప్రభావం ఉంటోందని... కంటి సమస్య తలెత్తినవారిని సరోజిని దేవీ కంటి ఆస్పత్రికి తరలించాలని సూచించింది.
నగరంలోని గాంధీ ఆస్పత్రి,సరోజిని దేవి ఆస్పత్రి,ఈఎన్టీ ఆస్పత్రుల సూపరింటెండెంట్లు పరస్పర సమన్వయంతో రోగులకు తగిన చికిత్స అందించాలని ఆదేశించింది.
ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో బ్లాక్ ఫంగస్(మ్యుకోర్మైకోసిస్) కేసులు బయటపడ్డ సంగతి తెలిసిందే. తెలంగాణలోని భైంసా పట్టణంలోనూ మూడు బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయి. ఇందులో ఒకరు మృతి చెందారు. ప్రస్తుతం మరో ముగ్గురు బ్లాక్ ఫంగస్ పేషెంట్లకు గాంధీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు డీఎంఈ రమేశ్ రెడ్డి తెలిపారు. బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ముందుగానే అప్రమత్తమై తగిన చర్యలు తీసుకుంటోంది.
బ్లాక్ ఫంగస్ గాలి ద్వారానే సోకుతుంది. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి త్వరగా సోకే ప్రమాదం ఉంది. కరోనా చికిత్స సమయంలో అధిక మోతాదులో స్టెరాయిడ్స్ ఇవ్వడం వల్ల చాలామందిలో రోగ నిరోధక శక్తి తగ్గుతోంది.దీంతో కరోనా నుంచి కోలుకున్న తర్వాత.. వారు బ్లాక్ ఫంగస్ బారినపడుతున్నారు.
దడ పుట్టిస్తున్న 'బ్లాక్ ఫంగస్'... మధ్యప్రదేశ్లో బయటపడ్డ 50 కేసులు... అప్రమత్తంగా ఉండాలన్న సీఎం...
కరోనా సోకి ఆక్సిజన్ సపోర్ట్ తీసుకుంటున్నవారు హ్యుమిడిఫయర్లలో స్టెరైల్ నీటిని కాకుండా సాధారణ నీటిని ఉపయోగించడం కూడా బ్లాక్ ఫంగస్కు కారణమని అహ్మదాబాద్కు చెందిన సీనియర్ కార్డియాలజిస్ట్ అతుల్ అభ్యంకర్ తాజాగా వెల్లడించారు. ఆక్సిజన్కు ఉపయోగించే హ్యుమిడిఫయర్లలో స్టెరైల్ నీటినే ఉపయోగించాలి. కానీ, ప్రైవేట్ ఆస్పత్రులు, కోవిడ్ ఐసోలేషన్ సెంటర్లు, ఇళ్లలో ఉండి ఆక్సిజన్ పెట్టుకుంటున్న వారు సాధారణ నీటినే వాడుతున్నారని ఆయన పేర్కొన్నారు.దీంతో ఆ నీటిలో ఉండే బాక్టీరియా కారణంగా బ్లాక్ ఫంగస్ సోకే ప్రమాదం ఏర్పడుతోందన్నారు.
బ్లాక్ ఫంగస్ సోకినవారిలో జ్వరం,దగ్గు,ఛాతినొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. అలాగే కంటి చుట్టూ ఉండే కండరాలు బిగుసుకుపోయి అంధత్వానికి దారితీయవచ్చు. ఫంగస్ ముక్కు నుంచి మెదడుకు చేరితే మరణం సంభవించవచ్చు. అయితే బ్లాక్ ఫంగస్ కొత్త వ్యాధి ఏమి కాదని... దానికి చికిత్స ఉందని వైద్యులు చెబుతున్నారు. సకాలంలో చికిత్స తీసుకోవడం ద్వారా బ్లాక్ ఫంగస్ నుంచి కోలుకోవచ్చునని అంటున్నారు.