బంగారు తెలంగాణ ఇదేనా?: అంబులెన్స్ రాక కూతురు శవాన్ని చేతులపై మోసుకెళ్లిన తండ్రి
Recommended Video
కరీంనగర్: కంటికి రెప్పలా పెంచిన ఏడేళ్ల కూతురు తీవ్ర అనారోగ్యంతో మృతి చెందడంతో శోకసంద్రంలో మునిగిపోయాడు ఆ తండ్రి. వైద్య సిబ్బంది ఆమె మృతదేహాన్ని స్ట్రెచర్పై తీసుకొచ్చి ఆస్పత్రి మెయిన్ ఎంట్రాన్స్ మెట్ల వద్ద ఉంచారు. బిడ్డ శవాన్ని ఇంటికి తీసుకెళ్దామంటే చేతిలో అంత డబ్బు లేదు. దీంతో ఆస్పత్రిలో ఉన్న అంబులెన్స్ను కోరినా అధికారులు అంగీకరించలేదు.
ఇక చేసేదేం లేక ఆటో స్టాండ్ వరకుక చేతులపైనే కూతురు శవాన్ని మోసుకెళ్లాడు ఆ తండ్రి. ఈ ఘటన రెండ్రోజుల క్రితం తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. ఆ కూతుర్ని మోసుకెళ్లిన తండ్రి పేరు సంపత్ కుమార్.
పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం కూనారం గ్రామానికి చెందిన సంపత్ కుమార్.. తన కూతురు కోమలత(7) గత కొంత కాలంగా కాలేయ సమస్యతో బాధపడుతోంది. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం కోమలతను కరీంనగర్ జిల్లా ఆస్పత్రిలో చేర్పించారు.
తీవ్ర అనారోగ్యంతో పరిస్థితి విషమించి ఆదివారం ఆ చిన్నారి ఆస్పత్రిలోనే చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. దీంతో కన్నీరుమున్నీరుగా విలపించాడు సంపత్. తన కూతురు శవాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్ను కోరగా.. పని చేయడం లేదంటూ అధికారులు నిరాకరించారు. దీంతో చేసేదేం లేక ఓ వైపు కళ్లల్లోంచి కన్నీరు కారుస్తూనే.. తన కూతురు శవాన్ని చేతులపై మోసుకెళ్లాడు.
ఆ తర్వాత కూడా కోమలత శవాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు ఏ వాహనం కూడా ముందుకు రాలేదు. ఓ ఆటో డ్రైవర్ను కాళ్లావేళ్లా పడటంతో అతడు అంగీకరించాడు. దీంతో సంపత్ కుమార్ సదరు ఆటోలో తన కూతురు శవాన్ని ఇంటికి తీసుకెళ్లాడు. ఈ ఘటనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
బంగారు తెలంగాణ అంటే ఇదేనా? అంటూ ప్రతిపక్షాలు ప్రభుత్వంపై మండిపడుతున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రులను ప్రైవేటు ఆస్పత్రులకు ధీటుగా తీర్చిదిద్దామని చెప్పుకుంటున్న నాయకులు ఈ ఘటనకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.