ఎల్లలు దాటిన ప్రేమ: ఇండోనేసియా అమ్మాయితో తెలంగాణ యువకుడి పెళ్లి
హైదరాబాద్: ఇండోనేసియా యువతితో తెలంగాణ అబ్బాయికి పెళ్లి జరిగింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ఇంద్రారెడ్డి నగర్లోని శ్రీ శ్రీనివాస కళ్యాణ మండపంలో ఆదివారం ఘనంగా వివాహం జరిగింది. రంగారెడ్డి జిల్లా పూడురు మండలం కడుమూరు గ్రామానికి చెందిన సురేష్ గౌడ్ పదేళ్ల క్రితం ఉన్నత విద్య కోసం ఆస్ట్రేలియాకు వెళ్లాడు.
చదువు అనంతరం అతను అక్కడే స్థిరపడ్డాడు. ఈ క్రమంలో అక్కడే ఉద్యోగం చేస్తున్న ఇండోనేసియా యువతి అన్నవితో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. ఇరువురు తమ కుటుంబ సభ్యులను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.
ఈ పెళ్లికి ఇండోనేసియా యువతి అన్నవి తల్లిదండ్రులు, అన్నయ్య, చెల్లెలు హాజరయ్యారు. అన్నవి, వారి కుటుంబ సభ్యులు హిందూ సంప్రదాయం పట్ల ముచ్చట పడ్డారు. ఇదే పద్ధతిలో వారి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.
తెలుగువారు ఇలా విదేశాలకు చెందిన అమ్మాయిలను లేదా అబ్బాయిలను పెళ్లిళ్లు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ప్రేమ, పెళ్లిళ్ళకు ఎల్లలు, హద్దులు లేవని వారు నిరూపిస్తున్నారు.