కొట్లాడటం తెలుసు, దొంగ దెబ్బతీయడం కాదు, మంత్రి ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు కొట్లాడటం తెలుసు కానీ.. దొంగ దెబ్బతీయడం రాదని పేర్కొన్నారు. గత కొంతకాలంగా సీఎం కేసీఆర్, మంత్రి ఈటల రాజేందర్ మధ్య అభిప్రాయ విభేదాలు వచ్చినట్టు తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణ సమయంలో కూడా చివరి నిమిషంలో ఈటల రాజేందర్ పేరును చేర్చారు. అయితే ఇదివరకు కేటాయించిన ఆర్థికశాఖ కాకుండా వైద్యరోగ్యశాఖ బాధ్యతలు అప్పగించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

చివరి నిమిషంలో..
మంత్రివర్గంలోకి తీసుకుంటారనే అంశంపై చివరి నిమిషంలో పిలువడం, ఆ ప్రాధాన్య పోర్టుపోలియో ఇవ్వడంతో.. గులాబీ దళపతి, ఈటల రాజేందర్ మధ్య మునుపటి సాన్నిహిత్యం క్రమంగా తగ్గింది. ఈ క్రమంలో మంత్రివర్గంలో ఇద్దరిని తప్పిస్తారనే ప్రచారం జోరుగా సాగింది. అందులో ఈటల ఒకరని ఊహాగానాలు వినిపించడంతో మంత్రి మరింత స్వరం పెంచారు. తన గురించి సీఎం కేసీఆర్కు ఎవరో వ్యతిరేకంగా చెప్తున్నారని పేర్కొన్నారు.

ఓనర్లం మేమే..
ఇదివరకు గులాబీ జెండా ఓనర్లు తాము అని, మంత్రి పదవీ తనకు భిక్ష కాదని చెప్పారు. తనపై కావాలని కొందరు దుష్ర్పచారం చేస్తున్నారని ఆరోపించారు. దొంగలెవరో, దొరలెవరో త్వరలో తేలుతుందని ఈటల రాజేందర్ చెప్పడంతో అప్పట్లో చర్చానీయాంశమైంది. ఇన్నాళ్లు స్తబ్ధుగా ఉన్న మంత్రి ఈటల రాజేందర్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు.

కొట్లాడటమే తెలుసు..
తనకు కొట్లాడటం తెలుసు కానీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన నియోజకవర్గంలో పోటీ చేసే సమయంలో రూ.కోట్ల తన సొంత డబ్బును ఉపయోగించానని పేర్కొన్నారు. ఎవరి దగ్గర చేయి చాచలేదని పేర్కొన్నారు. అయితే తాను నమ్మినవారే తనను మోసం చేశారని, ఆ బాధ తనను నీడలా వెంటాడుతుందని గుర్తుచేశారు. కానీ ప్రజలు మాత్రం ధర్మం తప్పలేదని.. విచక్షణతో ఓటేయడంతో తాను గెలిచానని తెలిపారు. వారు ధర్మం తప్పి ఉంటే తాను మరోసారి గెలిచి ఉండేవాడిని కాదన్నారు.

బాగుపడరు..
ఎవరికైనా నమ్మకద్రోహం చేసేవారు బాగుపడరనే విషయం గుర్తుంచుకోవాలని ఈటల రాజేందర్ అన్నారు. ఇవాళ కాకుండే రేపైనా వారికి తగిన శిక్ష పడుతుందన్నారు. మంత్రి ఈటల రాజేందర్, సీఎం కేసీఆర్ మధ్య మరింత దూరం తీసుకొచ్చింది ఎవరు, వారి మధ్య విభేదాలు సృష్టించి లాభపడాలనుకున్నది ఎవరనే అంశం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.












Click it and Unblock the Notifications