మామకు విధేయుడు: బర్త్డే రోజున కేసీఆర్ కాళ్లు మొక్కి ఆశీర్వాదం (ఫోటోలు)
హైదరాబాద్: శుక్రవారం (జూన్ 3).. తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు 43వ పడిలోకి ప్రవేశించారు. తన పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి, మామ అయిన కేసీఆర్ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు.
మంత్రుల నివాస ప్రాంగణంలో మంత్రి హరీష్రావు 43వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. మంత్రుల నివాస ప్రాంగణానికి పెద్ద ఎత్తున తరలివచ్చిన నేతలు, కార్యకర్తలు, అభిమానుల మధ్య ఆయన పుట్టిన కేక్ కట్ చేశారు. హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, హరీశ్రావుకు కేక్ తినిపించి శుభాకాంక్షలు తెలిపారు.
మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, పలువురు ఎమ్మెల్యేలు హరీశ్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు. మరోవైపు రాష్ట్రం నలుమూలల నుంచి ఆయనకు శుభాకాంక్షలు తెలిపేందుకు పెద్దఎత్తున కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు అక్కడికి చేరుకున్నారు.
మహిళా నేతలు సైతం హరీశ్కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. కొంత మంది మహిళలు ఆనందంతో డ్యాన్స్లు చేశారు. మంత్రి హరీశ్ పుట్టిన రోజు సందర్భంగా మంత్రుల నివాస ప్రాంగణం వద్ద సందడి నెలకొంది. ఇదిలా ఉంటే అతి పిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చిన మంత్రి హరీశ్ రావు తెలంగాణ మంత్రివర్గంలో కీలకశాఖ బాధ్యతలను నిర్వహిస్తున్నారు.
తెలంగాణలో మంచి మాస్ లీడర్గా పేరుంది. తెలంగాణలోని సిద్ధిపేట నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సిద్ధిపేటలోని చింతమడక గ్రామంలో హరీశ్ రావు జన్మించారు. హైదరాబాద్ మాసబ్ ట్యాంక్లో సమీపంలో ఉన్న పాలిటెక్నిక్ కాలేజీలో పాలిటెక్నిక్ విద్యను అభ్యసించారు.
2004 సార్వత్రిక ఎన్నికల్లో కేసీఆర్ సిద్దిపేట అసెంబ్లీ, కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుంచి టీఆర్ఎస్ పార్టీ తరుపున పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత కేసీఆర్ పార్లమెంట్కు వెళడంతో, 32 ఏళ్ల వయసులో 2004లో సిద్ధిపేట నియోజక వర్గం నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందారు.