రంగంలోకి ఆ ఇధ్దరు మంత్రులు: రేవంత్కు చెక్ పెట్టే ప్లాన్ ఇదే!
కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గంలో రేవంత్రెడ్డిని రాజకీయంగా చెక్ పెట్టేందుకు రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్రావు నేతృత్వంలో వ్యూహరచన చేస్తోంది.
కొడంగల్:కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గంలో రేవంత్రెడ్డిని రాజకీయంగా చెక్ పెట్టేందుకు రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్రావు నేతృత్వంలో వ్యూహరచన చేస్తోంది. మంత్రి హరీష్రావు ఆదేశాలకు అనుగుణంగా మరో మంత్రి పి. మహేందర్రెడ్డి యాక్షన్లోకి దిగారు.
కొడంగల్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరిగినా, 2019 ఎన్నికల్లో ఈ స్థానం నుండి పోటీ చేసేందుకు మంత్రి మహేందర్ రెడ్డి సోదరుడు పి.నరేందర్ రెడ్డి ఆసక్తిని కనబరుస్తున్నారు. ఈ స్థానం నుండి పి.నరేందర్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే గురునాథ్రెడ్డి తనయుడు ముద్దప్ప కూడ పోటీ చేసేందుకుఆసక్తి చూపుతున్నారు.
కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గంలో రేవంత్రెడ్డిని దెబ్బతీసేందుకు ఇప్పటికే టిఆర్ఎస్ నాయకత్వం వ్యూహ రచన చేస్తోంది. ఇప్పటికే రేవంత్రెడ్డి ముఖ్య అనుచరులను టిఆర్ఎస్ తమ పార్టీలోకి చేర్చుకొంది.

కొడంగల్లో హరీష్ ప్లాన్
కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గంలో రేవంత్రెడ్డిని దెబ్బకొట్టేందుకు మంత్రి హరీష్రావు ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు టిఆర్ఎస్ యంత్రాంగం హరీష్రావు ప్లాన్ మేరకు రంగంలోకి దిగారు. హరీష్రావుకు చెందిన ముఖ్య అనుచరులు కూడ ఇప్పటికే కొడంగల్ వాస్తవ పరిస్థితిని అంచనావేసి హరీష్రావుకు రిపోర్ట్ను అందించినట్టు సమాచారం. ఈ సమాచారం మేరకు హరీష్రావు ప్లాన్ చేస్తున్నారు. హరీష్రావు ప్లాన్ మేరకు మరో మంత్రి మహేందర్ రెడ్డి యాక్షన్లోకి దిగారని టిఆర్ఎస్ వర్గాల్లో ప్రచారంలో ఉంది.

కొడంగల్లో అభివృద్ది పనులపై రివ్యూ
కొడంగల్ నియోజకవర్గానికి చెందిన అన్నిశాఖల అధికారులతో మంత్రులు సమీక్ష సమావేశం నిర్వహించినట్టు సమాచారం. ఈ సమావేశంలో నిలిచిపోయిన అభివృద్ధి పనులపై సమీక్షించారు. కొత్త పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, నిలిచిపోయిన పనులను నెల రోజుల్లో పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని ఆదేశాలిచ్చారు. ప్రతి గ్రామంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, కావాల్సిన నిధులపై మంత్రి మహేందర్రెడ్డి అధికారులతో నివేదికలు సిద్ధం చేయించారని సమాచారం.

తాండూరు నేతలను ఇంచార్జీలుగా
కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గంలో మంత్రి మహేందర్ రెడ్డి సోదరుడు నరేందర్ రెడ్డి పోటీ చేసే అవకాశం ఉందని టిఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం సాగుతున్న నేపథ్యంలో మంత్రి మహేందర్ రెడ్డి వ్యూహత్మకంగా అడుగులు వేస్తున్నారు. తాండూరు ప్రాంతానికి చెందిన నాయకులను మండలా లు, గ్రామాలకు ఇన్చార్జిలుగా నియమించారు. వారంతా గ్రామాల్లోకి వెళ్లి స్థానిక, కుల సంఘాల నాయకుల వివరాలు సేకరించి మహేందర్రెడ్డికి అప్పగించారు.

టిఆర్ఎస్ బలోపేతం కోసం ఇలా
రేవంత్రెడ్డి అనుచరులు, టిడిపి నుండి విజయం సాధించిన ప్రజా ప్రతినిధుల్లో మెజారిటీ సభ్యులు టిడిపిని వీడి టిఆర్ఎస్లో చేరారు. రేవంత్ రెడ్డి చేరిన కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేతలపై కూడ టిఆర్ఎస్ కేంద్రీకరించింది. అంతేకాదు స్థానికంగా ఉన్న పరిస్థితులకు అనుగుణంగా టిఆర్ఎస్ ఎన్నికలకు వ్యూహరచన చేస్తోంది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్దంగా ఉండేలా ఆ పార్టీ ప్లాన్ చేస్తోంది.












Click it and Unblock the Notifications