మైనింగ్ శాఖలో అక్రమాలపై కేటీఆర్ సీరియస్ : అధికారుల సస్పెన్షన్
హైదరాబాద్ : పనితీరులో అధికారుల అలసత్వాన్ని, అక్రమాలను ఏమాత్రం సహించట్లేదు తెలంగాణ మంత్రి కేటీఆర్. మొన్నటికి మొన్న నగరంలో మౌలిక సదుపాయాల నిర్లక్ష్యంపై జీహెచ్ఎంసీ అధికారులను నిలదీసిన కేటీఆర్.. రెండు రోజుల క్రితం నగరంలో అర్థరాత్రి తనిఖీలకు వెళ్లి రోడ్లు, నీటిసరఫరా, మురుగు డ్రైనేజీ వ్యవస్థలను పరిశీలించి పలు సూచనలు చేసిన విషయం తెలిసిందే.
తాజాగా మైనింగ్ శాఖ పై ఫోకస్ చేసిన మంత్రి కేటీఆర్.. ఇసుక తవ్వకాలపై పలు నివేదికలు తెప్పించుకుని శాఖ స్థితి గతులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమీక్షలో భాగంగా మైనింగ్ అక్రమాలను తీవ్రంగా పరిగణించిన కేటీఆర్, అక్రమాలకు పాల్పడే అధికారులకు కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

అక్రమాలకు పాల్పడ్డ అధికారులు, కాంట్రాక్టర్లపై చట్టబద్దమైన చర్యలకు ఆదేశించిన కేటీఆర్, మహబూబ్ నగర్ లోని గుడిబండ ఇసుక రీచ్ ను రద్దు చేశారు. అలాగే ఏడీ ప్రతాప్, రాయల్టీ ఇన్స్ పెక్టర్ రవికుమార్ లను విధుల నుంచి తప్పించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.
ఇదే సమావేశంలో నల్గొండ, మహబూబ్ నగర్, కరీంనగర్, నిజామాబాద్ లలో ఉన్న పలు ఇసుక రీచ్ ల నివేదికలను పరిశీలించారు మంత్రి కేటీఆర్. ఆయా ఇసుక రీచ్ లపై క్షేత్ర స్థాయి విచారణకు ఆదేశిస్తూ.. ఇందుకోసం ఉన్నతస్థాయి అధికారులతో కూడిన ఓ ప్రత్యేక టీమ్ ను ఏర్పాటు చేశారు. సమావేశం సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. మైనింగ్ ద్వారా వచ్చే ఆదాయం ప్రజలకే చెందాలని, మైనింగ్ ఆదాయం జాతి సంపద అని అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications