రేవంత్ రెడ్డి ఓ బ్లాక్మెయిలర్, నాడు చంద్రబాబుకే ఫిర్యాదు చేశా: మంత్రి మల్లారెడ్డి సంచలనం
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డిపై మంత్రి మల్లారెడ్డి మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మంత్రి మల్లా రెడ్డి భూ కబ్జాకు సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయంటూ రేవంత్ రెడ్డి మీడియా ముఖంగా చెప్పిన నేపథ్యంలో మల్లారెడ్డి స్పందించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు.

రేవంత్ ఓ బ్లాక్మెయిలర్ అంటూ మల్లారెడ్డి
తాను ఎంపీగా ఉన్నప్పటి నుంచి రేవంత్ రెడ్డి తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని మల్లారెడ్డి ఆరోపించారు. టీడీపీ మల్కాజ్గిరి సీటు రేవంత్కు కాకుండా తనకు ఇచ్చినందుకు బ్లాక్ మెయిల్ చేస్తున్నారని అన్నారు. బ్లాక్ మెయిల్ చేస్తున్నారని.. అప్పుడే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. అప్పట్నుంచి ఇప్పటివరకు రేవంత్ రెడ్డి తనను ఇబ్బంది పెడుతూనే ఉన్నారని మల్లారెడ్డి వెల్లడించారు. 2012లో మెడికల్ కాలేజీలను ప్రారంభించినట్లు మల్లారెడ్డి చెప్పారు. బాలికల కోసం ప్రత్యేకంగా మహిళా కాలేజీలను స్థాపించినట్లు పేర్కొన్నారు. హాస్టళ్లల్లో దాదాపు 7 వేల మంది అమ్మాయిలు ఉంటున్నారని తెలిపారు.

దొంగపత్రాలతో రేవంత్ బెదిరింపులు..
ఏవో జిరాక్స్ కాపీలు తీసుకొచ్చి తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మల్లారెడ్డి మండిపడ్డారు. దొంగ పత్రాలు చూపెట్టి తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. అన్ని అనుమతులతోనే ఆస్పత్రిని నిర్మించినట్లు మంత్రి మల్లారెడ్డి స్పష్టం చేశారు. తన కాలేజీలు, ఆస్పత్రులకు సంబంధించిన అన్ని పత్రాలు సక్రమంగానే ఉన్నాయన్నారు. తన సంస్థలను ఉన్నతంగా నడుపుతున్నట్లు మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. తాను ఎంపీగా రూ. 200 కోట్ల అభివృద్ధి పనులు చేసినట్లు ఆయన తెలిపారు. రేవంత్ రెడ్డి ఎంపీ అయ్యాక కూడా బ్లాక్ మెయిల్ చేస్తున్నారని చెప్పారు. తన విద్యా సంస్థల్లో ఎలాంటి అక్రమాలు జరగలేదని కేంద్రం లిఖితపూర్వకంగా సమాధానం చెప్పిందని మంత్రి మల్లారెడ్డి వివరించారు.

రేవంత్.. రాజీనామా సవాల్ ఎందుకు తీసుకోలేదు: మల్లారెడ్డి
అంతేగాక, తాను రాజీనామా చేసిన సవాల్ను రేవంత్ ఎందుకు తీసుకులేదు? అని ప్రశ్నించిన మంత్రి మల్లారెడ్డి.. నీ కోసం సీఎం కేసీఆర్ రాజీనామా చేయాలా రేవంత్ ? అని మండిపడ్డారు. నీకు(రేవంత్) దమ్ము ఉంటే హుజురాబాద్లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు తెచ్చుకో అని కొత్త సవాల్ చేశారు. ఇక, రేవంత్ అబద్ధం ఆడితే... అతికేటట్లు ఉండాలి.. ఏవో పేపర్లు చూపి డ్యామేజ్ చేస్తే అయిపోతుందా ? జవహర్నగర్లో గవర్నమెంట్ స్థలంలో పేద ప్రజలు ఇల్లు కట్టుకున్నారు.. కానీ, సౌకర్యాలు లేకుండే.. తాను కల్పించానన్నారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత 330 ఎకరాల్లో జీవో తీసి ఇచ్చారు. పేద ప్రజల కోసం కట్టిన ఇళ్లకు క్రమబద్ధీకరణ చేశారన్నారు. జవహర్నగర్లో తన కోడలు పేరు మీద 350 గజాల స్థలం ఉంది... టాక్స్ కడుతున్నామన్నారు. ఎన్వోసీ ఉంది... సేల్ డిడ్ ఉందన్నారు. మాకు రెండు మెడికల్ కాలేజీలు ఉన్నాయి. గత ఏడాది సెప్టెంబర్ 9 న ఆస్పత్రి ప్రారంభించాం. నా కాలేజీలపై పార్లమెంట్లో రేవంత్ ప్రశ్న అడిగారు. అంతా బాగుంది అని కేంద్రం సమాధానం ఇచ్చింది. డిఫెన్స్ కమిటీ మీటింగ్ లో బంగ్లాలు... ఫంక్షన్ హాల్ల గురించి రేవంత్ అడుగుతున్నారట.. ఇంతకంటే సిగ్గుచేటు ఉంటుందా? అంటూ ఎద్దేవా చేశారు మల్లారెడ్డి.

రేవంత్, బండి సంజయ్కి మల్లారెడ్డి హెచ్చరిక
మరోవైపు ఎన్నో అద్భుతమైన పథకాలను తీసుకొచ్చిన సీఎం కేసీఆర్ను, మంత్రులను తిడుతుంటే చూస్తూ ఉండాలా? అని మల్లారెడ్డి ప్రశ్నించారు. బండి సంజయ్, రేవంత్ మమ్మల్ని తిడితే ప్రజలు తోలు తీస్తారని హెచ్చరించారు. మల్లా రెడ్డి యూనివర్సిటీకి 21 ఎకరాలు పెట్టాం... నా సమాధానం రేవంత్కు కాదు... తెలంగాణ ప్రజలకే అన్నారు. నేను చెప్పిన నాకు 6 వందల ఎకరాల ఉందని.. అందులో 400 ఎకరాల కాలేజీల పేరుతో ఉంది. వాటికి రైతు బంధు వస్తుందా? అని ప్రశ్నించారు. నాకు నాలుగు సొసైటీలు ఉన్నాయి. అన్నింటికి అన్ని అనుమతులు ఉన్నాయి. నేను పాలు అమ్మిన, పూలు అమ్మిన. నేను అభివృద్ధి చెందిన.. రేవంత్ ఏమి చేసి అభివృద్ధి చెందాడు ? ఏం చేస్తే వచ్చేయో చెప్పాలని మల్లారెడ్డి డిమాండ్ చేశాడు. రేవంత్ మర్యాద ఇవ్వడం నేర్చుకో... నీకు మర్యాద దక్కుతుందని వ్యాఖ్యానించారు. రేవంత్ ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండు.. ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు మల్లారెడ్డి. కాగా, తన వద్ద ఆధారాలున్నాయంటూ పలు పత్రాలు రేవంత్ రెడ్డి మీడియా ముందు చూపిన విషయం తెలిసందే. తన వద్ద ఆధారాలున్నాయని, సీఎం కేసీఆర్ చర్యలు తీసుకుంటారా? అని ప్రశ్నించారు. తన సవాల్ మంత్రి మల్లా రెడ్డికి కాదని, సీఎం కేసీఆర్ కు అని అన్నారు. ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు రావాలని కోరిన ఆయన.. కేసీఆర్కి చేతనైతే రావాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ విమర్శలపైనా రేవంత్ స్పందించారు. చంద్రబాబు చెప్పులు మోసి బతికిందే కేసీఆర్ అంటూ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. మరోవైపు.. కేటీఆర్... పేరే టీడీపీది అంటూ ఎద్దేవా చేశారు. కేటీఆర్.. రకుల్ రావు అని పెట్టుకో అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్, కేటీఆర్కి సవాల్ విసురుతున్నా.. ముందస్తు ఎన్నికలకు రండి.. మేం మా బలం ఏంటో చూపిస్తాం అన్నారు. ఒకవేళ ముందస్తు ఎన్నికలకు కేటీఆర్ ఒప్పుకోకపోతే... సీఎం కేసీఆర్ రాజీనామా చేసి వచ్చినా.. గజ్వేల్లో పోటీ చేస్తానన్నారు.. మేమేంటో మా బలం ఏంటో చూపిస్తాం.. టీఆర్ఎస్ గెలుస్తుందా..? కాంగ్రెస్ గెలుస్తుందా తేల్చుకుందాం అంటూ రేవంత్ సవాల్ విసిరారు.












Click it and Unblock the Notifications